శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (11:56 IST)

త్వరలో గ్రామాల్లో శాశ్వత ‘ఆధార్‌ ’ కేంద్రాలు!

ఒకప్పుడు తమను గుర్తించాలంటే జనన ధ్రువీకరణ పత్రం ఉంటేనే జనాభా లెక్కల్లో ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించేది. కొంతకాలం నుంచి దీనికి సంబంధించి ఆధార్‌ కీలకంగా మారింది. ప్రతి వ్యక్తికి ఇప్పుడు యూఐడీ తప్పనిసరి అయ్యింది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో పేదలకు తెలుపు రంగు రేషన్‌ కార్డుతోపాటు ఆధార్‌ ఉండాల్సిన అవసరం ఏర్పడింది.

మధ్య, ఎగువ తరగతుల వారికి సంక్షేమ పథకాలు అందకపోయినా, ప్రభుత్వ లావాదేవీల్లో ఏ పని సజావుగా జరగాలన్నా ఆధార్‌ లేకపోతే శ్రీముఖం ఎదురవుతున్న పరిస్థితి నెలకొంది. ఎవరికి ఆధార్‌ సంఖ్య లేకపోయినా వారు సమాజంలో లేనట్టే అనే రీతిలో ఈ సంఖ్యకు ప్రాముఖ్యం ఏర్పడింది.

కొత్తగా ఆధార్‌ కార్డు నమోదు, కార్డులో తేడాలు సరిచేసే సదుపాయం పట్టణాల్లో అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే గ్రామాల్లో ఈ సౌలభ్యం లేకపోవడంతో చాలామంది కార్డుల్లో సవరణలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో సంక్షేమ పథకాలకు అనర్హతకు గురవుతున్నారు.
 
అలాగే 1-5 ఏళ్లు పిల్లలకు ఆధార్‌ కావాలంటే ప్రయాసపడి వారిని దూర ప్రాంతాలకు తీసుకెళ్లి ఆధార్‌ కేంద్రంలో నమోదు చేసుకోడానికి గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధుల వేలి ముద్రలు అరిగిపోయి పింఛను రాక, రేషన్‌ అందక సవరణ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో త్వరలో గ్రామాల్లో శాశ్వత ప్రాతిపదికన ఆధార్‌ నమోదు కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
 
దీంతో ఒక్కో మండలంలో ఆయా గ్రామ పంచాయతీలు, నివసించే జనాభా ఆధారంగా మండలానికి మూడు నుంచి నాలుగు ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే ఆధార్‌ కేంద్రాల్లో సచివాలయ సిబ్బంది డిజిటల్‌ అసిస్టెంట్‌, ఉమెన్‌ ప్రొటక్షన్‌ విభాగం వారు ప్రజలకు సేవలందిస్తారు.