గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 ఆగస్టు 2024 (17:16 IST)

భారత ప్రధాని మోడీని ఆహ్వానించిన పాకిస్థాన్

narendra modi
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని శత్రుదేశం పాకిస్థాన్ ఆహ్వానించింది. తమ దేశంలో పర్యటించాలని కోరింది. వచ్చే అక్టోబరు నెలలో నిర్వహించబోయే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ (సీహెచ్‌జీ) సమావేశంలో పాల్గొనేందుకు తమ దేశానికి రావాలని పాకిస్థాన్ కోరింది. ఈ పిలుపును మోడీతో సహా షాంఘే సంస్థ‌కు చెందిన ఇతర నేతలనూ కూడా ఆహ్వానించింది. ఈ సదస్సు ఇస్లామాబాద్ కేంద్రంగా జరుగనుంది. ఈ సమావేశం గత యేడాది బిష్కెక్‌లో జరిగింది. ఇందులో భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. 
 
అయితే, పాకిస్థాన్‌తో మనకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పైగా అక్కడ భద్రతా ఏర్పాట్లపై అనుమానాల నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ సదస్సుకు హాజరయ్యేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈసారి కూడా విదేశాంగ మంత్రి జైశంకర్‌ను పంపించే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. అయితే, జమ్మూలో ఇటీవలి ఉగ్రదాడుల నేపథ్యంలో విదేశాంగ మంత్రి భద్రతపై నిఘా వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. 2015లో అప్పటి మన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్థాన్‌లో పర్యటించారు. అదే చివరి పర్యటన. ఆ తర్వాత భారత్ నుంచి కేంద్రంలోని పెద్దలు ఎవరూ ఆ దేశంలో పర్యటించలేదు. 
 
ఇదిలావుంటే, సీహెచ్‌జీ అంటే ఏమిటి? ప్రాంతీయ భద్రత, మధ్య ఆసియా దేశాలతో సహకారం వంటి అంశాల పర్యవేక్షణకు ఏర్పాటైందే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్‌జీ). రష్యా, చైనా నేతృత్వంలోని సీహెచీలో భారత్, పాక్ సభ్యులుగా ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ దీనికి అధ్యక్షత వహిస్తోంది. అక్టోబరు 15-16 తేదీల్లో సీహెచ్‌జీ శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లుచేస్తుంది. అయితే, ప్రత్యక్షంగా పాల్గొనే వీలుకుదరని నేతల కోసం వర్చువల్ విధానం ఏర్పాటు చేస్తారా లేదా అనేది పాక్ ఇంకా వెల్లడించలేదు.