గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (09:19 IST)

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి... నేతల నివాళులు

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలు గురువారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజీవి చిత్రపటానికి అనేక మంది నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా నివాళులు అర్పించినట్టు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
అలాగే, కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ కూడా నివాళులు అర్పించారు. వీరితో పాటు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజీవ్ కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ, ఈమె భర్త రాబర్ట్ వాద్రాలు కూడా రాజీవ్‌కు నివాళులు అర్పించారు. 
 
కాగా, 1944 ఆగష్టు 20వ తేదీన ముంబైలో రాజీవ్ గాంధీ జన్మించారు. 1984 అక్టోబరులో దేశ ప్రధానిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అతి చిన్న వయస్సులో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రికార్డు కూడా ఆయనదే. 1989 డిసెంబర్ 2 వరకు ప్రధానిగా రాజీ‌వ్‌ గాంధీ పని చేశారు. 
 
1991లో మే నెల 21వ తేదీన తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టీటీఈ) జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్‌ గాంధీ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజును 'సద్భావన దివాస్'గా పాటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు.