1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 జూన్ 2020 (11:19 IST)

భూభాగంలోకి చైనా సైనికులు రాలేదా... మరి సైనికులు ఎలా చనిపోయారు?

మన భూభాగంలోకి చైనా సైనికులు రాలేదా? మరి భారత సైనికులు ఎలా చనిపోయారో దేశ ప్రజలకు చెప్పాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు. పైగా, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి మాట్లాడటపుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన హితవు పలికారు. 
 
చైనా బలగాలు హద్దుమీరి గాల్వాన్ లోయలోకి ప్రవేశించి 20 మంది భారత సైనికులను హతమార్చిన విషయం తెల్సిందే. దీనిపై ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో "భారత సరిహద్దుల్లోకి ఎవరూ రాలేదు. మన పోస్టులను ఎవరూ ఆక్రమించలేదు" అని మోదీ వ్యాఖ్యానించగా, మరి భారత సైనికులు ఎందుకు చంపబడ్డారు? వారిని ఎక్కడ చంపారు? అంటూ రాహుల్ గాంధీ మండిపడిన సంగతి తెలిసిందే. 
 
రాహుల్ వ్యాఖ్యలకు ప్రజల నుంచి కూడా మద్దతు లభించింది. నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు విపక్ష నేతలు విరుచుకుపడగా, ఇప్పుడు మన్మోహన్ సింగ్ సైతం విమర్శలు గుప్పించడం గమనార్హం. ఇదే అంశంపై తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
ప్రధాన మంత్రి స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఏవైనా పదాలను వాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు. గత శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు విమర్శలను కొని తెచ్చిన వేళ, ఈ ఉదయం మన్మోహన్ సింగ్, ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
"సరిహద్దులో భారత భూభాగాన్ని కాపాడేందుకు కల్నల్ బి.సంతోష్ బాబు, మన జవాన్లు చేసిన ప్రాణ త్యాగాలను తక్కువ చేసి చూడవద్దు. అది ప్రజల నమ్మకాన్ని వంచించినట్టే" అని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.
 
ఈ సమయంలో మనం చరిత్రాత్మక కూడలిలో నిలబడివున్నాం. మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చర్యలు భావి తరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని మరువరాదని సూచించిన మన్మోహన్, మన ప్రజాస్వామ్యం ప్రధాని కార్యాలయంలోనే ఆగిపోయింది. జాతి భద్రత, సరిహద్దు అంశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించే వేళ, జాతి భద్రతను మనసులో ఉంచుకుని మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.