1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (10:28 IST)

అస్సాం ముఖ్యమంత్రి హిమంత హత్యకు కుట్ర - ఓ వ్యక్తి అరెస్టు

అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి బిశ్వశర్మ హత్యకు ఓ వ్యక్తి కుట్రపన్నాడు. ఈ కుట్రను పోలీసులు ఛేదించారు. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన దుండగులు అతడి చేతికి తుపాకి ఇచ్చి సీఎంను హత్య చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో బెదిరిపోయిన ఆ వ్యక్తి తనను రక్షించాలంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది.
 
అస్సాంలోని లఖింపూర్ జిల్లాకు చెందిన శరత్‌దాస్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలోని సందేశం మేరకు.. 'దిమాపూర్ (నాగాలాండ్) నుంచి ఈ వీడియో చేస్తున్నానని, ఈ నెల 9న కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చాను. ఈ క్రమంలో తనను కొందరు అపహరించి ఓ పిస్టల్, మూడు బుల్లెట్లు చేతికి అందించి ‘మామ’ (హిమంత బిశ్వశర్మ)ను చంపాలని ఒత్తిడి చేశారు. ఈ విషయం కనుక బయటకు తెలిస్తే తనను చంపేస్తారు అంటూ బోరున విలపించాడు. 
 
పైగా, తన వద్ద ఉన్న డాక్యుమెంట్లతోపాటు రూ.3 లక్షలు అపహరించారని వాపోయాడు. కిడ్నాపర్లు తనను హింసిస్తున్నారని పేర్కొన్నాడు. వీడియో వైరల్ కావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. అసోం-నాగాలాండ్ సరిహద్దు ప్రాంతమైన ఖంఖతిలోని ఓ హోటల్‌లో శరత్ ఉన్నట్టు గుర్తించి రక్షించారు. వీడియోలో శరత్ చెప్పింది నిజమేనా? అన్న దానిపై దర్యాప్తు ప్రారంభించారు.