బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (19:34 IST)

ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ : ఆసక్తి చూపని తమిళ ఓటర్లు!

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా, మంగళవారం ఎన్నికల పోలింగ్ జరిగింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి శాసనసభలకు ఉన్న అన్ని సీట్లకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. అలాగే, వెస్ట్ బెంగాల్‌లో మూడో దశ పోలింగ్ ముగియగా, అస్సాంలో రెండు దశల పోలింగ్ నేటితో ముగిసింది. 
 
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగిన ఈ పోలింగ్‌లో తమిళ ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, పుదుచ్చేరిలో మాత్రం రికార్డు స్థాయిలో నమోదైంది. 
 
అయితే, సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అత్యధిక సంఖ్యలో పార్టీలకు సమరాంగణంగా మారిన తమిళనాడులో సాయంత్రం 6 గంటల సమయానికి 64.92 శాతం పోలింగ్ నమోదైంది. 
 
తమిళనాడులో మంగళవారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి లోపించింది. సాయంత్రం వరకు అదే ఒరవడి కొనసాగడంతో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు.
 
కేరళలో సాయంత్రం 5 గంటల సమయానికి 69.95 శాతం ఓటింగ్ నమోదైంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సాయంత్రం 5 గంటల సమయానికి 77.90 శాతం ఓటింగ్ జరిగింది. మూడో విడత పోలింగ్ జరుపుకున్న బెంగాల్‌లో సాయంత్రం 5 గంటల వరకు 77.68 శాతం పోలింగ్ జరిగింది. తుది విడత పోలింగ్ జరుపుకున్న అసోంలో సాయంత్రం 5 గంటల సమయానికి 78.94 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.