గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 7 మే 2019 (10:35 IST)

ప్రేమ వివాహం- పుట్టింటికి వచ్చిన అమ్మాయి, అల్లుడిపై పెట్రోల్ పోసి.. కడుపుతో వున్నా?

మహారాష్ట్రలో కులాంతర వివాహం చేసుకున్న దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.. యువతి కుటుంబ సభ్యులు. వివరాల్లోకి వెళితే.. అహ్మద్‌నగర్‌ జిల్లాలోని నిఘోజ్ గ్రామానికి చెందిన రుక్మిణీ సింగ్ (19), మంగేశ్ రణ్‌సింగ్ (23)లు గతేడాది అక్టోబరులో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. రుక్మిణి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మంగేశ్ కుటుంబ సభ్యులే దగ్గరుండి వీరి పెళ్లి జరిపించారు. 
 
అయితే, కుమార్తెపై ప్రేమతో రుక్మిణి తల్లి మాత్రం ఈ పెళ్లికి హాజరైంది. గత నెల 30న భర్తతో చిన్నపాటి గొడవ జరగడంతో రుక్మిణి తన పుట్టింటికి వెళ్లిపోయింది. మంగేశ్‌పై కోపంతో రగిలిపోతున్న రుక్మిణి కుటుంబ సభ్యులకు కక్ష తీర్చుకునేందుకు ఇదో సదవకాశంగా కనిపించింది. రుక్మిణితో ఫోన్ చేయించి మంగేశ్‌ను ఇంటికి పిలిపించారు.
 
ఇద్దరూ కలిసి ఇంట్లో మాట్లాడుకుంటుండగా గది తలుపులు మూసి పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రుక్మిణి.. పుణెలోని సస్సూన్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

50 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న మంగేశ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న యువతి తండ్రి కోసం గాలిస్తున్నారు. ఇంకా రుక్మిణి నెల తప్పిందని.. రెండు నెలలు గర్భంగా వున్నప్పటికీ కన్నకూతురిపై కనికరం లేకుండా పెట్రోల్ పోసి నిప్పించాడని పోలీసులు తెలిపారు.