శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (11:54 IST)

నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ చర్చ

దేశంపై కరోనా దండయాత్ర చేస్తోంది. గడిచిన నాలుగు రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదై ప్రజలను మరింత బెంబేలెత్తిస్తున్నాయి. కేసుల నమోదులో తన రికార్డులు తానే బద్దలు కొడుతోంది.

ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో సెకండ్‌ వేవ్‌లో కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అలజడి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం సాయంత్రం భేటీ కానున్నారు.

అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులు, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించనున్నారు.

కోవిడ్‌ నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు ఇచ్చే అవకాశాలున్నాయి. . దీంతోపాటు కరోనా కట్టడికి కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయడం, కర్ఫ్యూ తదితర అంశాలపై సలహాలు ఇవ్వనున్నారు. కాగా.. దేశంలో ఇప్పటికే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది.

ఈ క్రమంలో వ్యాక్సిన్‌ డోసుల సరఫరా.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతమయ్యేలా పలు కీలక ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మహారాష్ట్ర, ఢిల్లీలో వీకెండ్‌, నైట్‌ కర్ఫ్యూలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.