మంగళవారం, 29 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 29 జులై 2025 (14:08 IST)

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

deadbody
పూణెలో విషాదకర సంఘటన జరిగింది. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. హింజెవాడిలోని అట్లాస్ కాప్కోలో పనిచేస్తున్న 23 ఏళ్ల ఇంజనీర్ సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకుని మరణించాడు. మృతుడిని నాసిక్‌కు చెందిన పియూష్ అశోక్ కవాడేగా పోలీసులు గుర్తించారు. కవాడే కంపెనీ ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడే ముందు సూసైడ్ నోట్‌ను ఉంచాడని పోలీసులు తెలిపారు.
 
పింప్రి చించ్వాడ్ పోలీసుల కథనం ప్రకారం, కవాడే గత ఏడాది కాలంగా హింజెవాడిలోని ఒక కార్పొరేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం పనికి వెళ్లాడు. కానీ ఉదయం 10.10 గంటల ప్రాంతంలో తనకు ఛాతీ నొప్పి ఉందని చెప్పి మీటింగ్ మధ్యలోనే బయటకు వచ్చేసాడు. కానీ ఆ తర్వాత అతడు కంపెనీ 7 అంతస్తుల భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న తర్వాత, హింజెవాడి పోలీస్ స్టేషన్ నుండి ఒక బృందం దర్యాప్తు కోసం సంఘటనా స్థలానికి చేరుకుంది. సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ పంధారే మాట్లాడుతూ, మృతుడు తన సూసైడ్ నోట్‌లో తాను జీవితంలో విఫలమయ్యానని పేర్కొన్నాడంటూ వెల్లడించారు. ప్రాధమిక సమాచారం ప్రకారం అతడు పని ఒత్తిడి, మానసిక ఆందోళనతో వున్నట్లు చెబుతున్నారు.