1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జులై 2021 (23:08 IST)

కాంగ్రెస్ పార్టీలోకి ప్రశాంత్ కిషోర్.. నిజమేనా?

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే పీకే.. కాంగ్రెస్ కుండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

జులై-11న ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇప్పటివరకు పీకే.. కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం.. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు మార్గం సుగుమం అయినట్లు చెబుతున్నాయి.
 
ప్రశాంత్ కిషోర్ కి కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైన బాధ్యతలు అప్పగించాలన్న అంశమే ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న రాహుల్ గాంధీ నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుల బృందం ఒక సమావేశాన్ని నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశంలో కమల్ నాథ్, మల్లికార్జున్ ఖర్గే, ఏకే ఆంటోనీ, అజయ్ మాకెన్, ఆనంద్ శర్మ, హరీష్ రావత్, అంబికా సోని, కెసి వేణుగోపాల్ వంటి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
 
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరిక గురించి సీనియర్ లీడర్ల అభిప్రాయాలను రాహుల్ తెలుసుకున్నారు. పీకే చేరితే పార్టీకు లాభం చేకూరుతుందా? లేక నష్టం చేకూరుతుందా అనే దానిపై సీనియర్లతో రాహుల్ చర్చించినట్లు తెలుస్తోంది.
 
అయితే.. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరితేనే మంచిదని సమావేశానికి హాజరైన చాలా మంది సీనియర్ నేతలు.. రాహుల్ గాంధీతో పేర్కొన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పీకే చేరికతో పార్టీకి లాభం చేకూరుతుందని సీనియర్లు రాహుల్ గాంధీకి తమ అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం.