1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 24 జులై 2021 (10:22 IST)

మంత్రా.. మజాకా... ఐదేళ్ళలో ఆయన ఆస్తి పదింతల పెరుగుదల...

తమిళనాడులో అన్నాడీఎంకే వరుసగా పదేళ్ళపాటు అధికారంలో ఉన్నాది. అందులో ఎంఆర్ విజయభాస్కర్ అనే నేత ఐదేళ్ళపాటు మంత్రిగా ఉన్నారు. ఈయన ఆస్తులు గత ఐదేళ్ళ కాలంలో పదింతలు పెరిగాయి. ఈ విషయం ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీల్లో వెల్లడైంది. పైగా, అనేక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టిన ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. ఈనెల 22న జరిపిన దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకుని, బ్యాంకు లావాదేవీలు, లాకర్లు, కంపెనీ పత్రాలను సీజ్‌ చేశారు. 
 
గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణాశాఖా మంత్రిగా వ్యవహరించిన ఎంఆర్‌ విజయభాస్కర్‌ రవాణాశాఖలో ఉద్యోగ నియామకాలు, కొత్త బస్సులు, విడిభాగాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 
 
కొందరు బినామీలు చిక్కారని తెలుస్తోంది. సదరు కంపెనీల బ్యాంకు లావాదేవీలను, లాకర్లను సీజ్‌ చేశారు. చెన్నై, కరూరు జిల్లాల్లో 26 చోట్ల తనిఖీలు జరిగిన చోట్ల నుంచి రూ.25.56 లక్షల నగదు, కోట్ల రూపాయల ఆస్తి పత్రాలు, పెట్టుబడులు, కంపెనీలకు చెందిన లావాదేవీల విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. 
 
అంతేగాక చెన్నైలోని ఇంటి నుంచి 50 సవర్ల నగలు, రెండున్నర కిలోల వెండి వివరాలను రికార్డుల్లో నమోదు చేసి తిరిగి ఇచ్చేశారు. దాడుల సమయంలో ఇంటిలోనే ఉండిన మాజీ మంత్రి విజయభాస్కర్‌ వద్ద ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. మంత్రి పదవిలోకి రాకముందు, ఆ తర్వాత ఆస్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
 
26 చోట్లలో స్వాధీనం చేసుకున్న నగదు, స్థిర, చరాస్తులతో పోల్చిచూసుకుని పదింతలు ఆస్తి సంపాదించినట్లు తేలిందని ఏసీబీ వర్గాలు నిర్ధారించుకున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఆయనకు సమన్లు పంపి మరింత లోతుగా విచారణ జరిపి చార్జిషీటు దాఖలు చేయనున్నట్లు సమాచారం.