గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జనవరి 2021 (07:43 IST)

రిపబ్లిక్ డే వేడుకలు: సర్వం సిద్ధం.. రాఫెల్ యుద్ధ విమానాలు.. రామాలయం.. సోషల్ డిస్టన్స్

దేశ రాజధానిలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త శకటాలు, సైన్యం ఆయుధాలను ప్రదర్శించి, వాటిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశ ప్రజలందరికీ చూపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏడాది లక్షల మంది ఈ వేడుకలను నేరుగా తిలకించేవారు. కోవిడ్‌ నిబంధనల దృష్ట్యా... ఈ ఏడాది మాత్రం 25 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. 
 
ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలు... మొదటిసారి పరేడ్‌లో భాగం కానున్నాయి. 2020 సెప్టెంబర్లో ఈ విమానాలు భారత వాయుసేనలో చేరాయి. రాఫెల్ యుద్ధ విమానంతో వర్టికల్ ఛార్లీ ఫార్మేషన్‌ను చేయనున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధులు తెలిపారు. ఓ రాఫెల్ యుద్ధ విమానం లీడ్ తీసుకుని... రెండు జాగ్వార్, రెండు మిగ్-29 ఫైటర్లతో కలిసి ఏకలవ్య ఫార్మేషన్‌ను చేసి ప్రదర్శించనుంది.
 
తొలి మహిళా ఫైటర్ ఈ ప్రదర్శనలో భాగం పంచుకోనున్నారు. పలు రకాల తేలికపాటి యుద్ధ విమానాలతో పాటు సుఖోయ్-30 జెట్లు కూడా కనువిందు చేయనున్నాయి. రిపబ్లిక్ వేడుకల్లో శకటాల ప్రదర్శనలో... లేహ్‌లో భాగమైన థిక్సే కొండలపై ఓ పర్యాటక కేంద్రంగా ఉన్న చారిత్రక మఠం నమూనా తొలిసారిగా ప్రదర్శనలో ఉండనుంది. 
 
యూపీలో నిర్మిస్తున్న రామాలయం నమూనా, ఏపీకి సంబంధించి లేపాక్షీ థీమ్‌తో శకటం ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి. పరేడ్‌లో ఈసారి బంగ్లాదేశ్‌కు చెందిన 122 మంది సైనికుల బృందం కూడా పాల్గొననుంది. 1971 యుద్ధంలో పాక్‌పై విజయం సాధించి బంగ్లాదేశ్‌ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన దానికి గుర్తుగా... కేంద్రం ఈ ఏడాదిని స్వర్ణిమ్‌ విజయ్‌ వర్ష్‌గా ప్రకటించింది.