మృతురాలి కుటుంబానికి రూ.9 కోట్లు చెల్లించాలి : ఏపీఎస్ ఆర్టీసీకి సుప్రీం ఆదేశం
ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతిచెందిన మహిళ కుటుంబానికి రూ.9 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. గత 2014లోనే రూ.8.05 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఇపుడు ఈ పరిహారాన్ని రూ.9 కోట్లకు పెంచి తక్షణం చెల్లించాలని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు జారీచేసింది.
ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, లక్ష్మి నాగళ్ల అనే మహిళ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. భారత్కు వచ్చిన ఆమె గత 2009 జూన్ 13వ తేదీన భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమండ్రికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తన భార్య మృతికి కారణమైన ఆర్టీసీ రూ.9 కోట్ల పరిహారం చెల్లించాలంటూ మృతురాలి భర్త శ్యాంప్రసాద్ నాగళ్ల సికింద్రాబాద్ మోటార్ ప్రమాదాల కేసుల విచారణ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు.
ఇరు పక్షాల వాదనలు ఆలకించిన ట్రైబ్యునల్ రూ.8.05 కోట్ల పరిహారం చెల్లించాలని 2014లో ఆర్టీసీని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పరిహారాన్ని రూ.5.75 కోట్లకు తగ్గించింది. అయితే, మృతురాలి భర్త ఈ తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.
తన భార్య అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తూ అక్కడే శాశ్వతంగా ఉంటున్నామన్నారు. ఇపుడు భార్య మృతితో తమ నెల సంపాదన పోయిందన్నారు. ఆమె జీవించివుండగా నెలకు 11600 డాలర్లు సంపాదించేవారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల తన భార్య మృతి కారణమైన ఆర్టీసీ రూ.9 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరారు. ఈ వాదనలు ఆలకించిన ధర్మాసనం... బాధిత కుటుంబానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. లక్ష్మి కుటుంబానికి రూ.9.64 కోట్ల పరిహారం చెల్లించాలని ఏపీఎస్ ఆర్టీసీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.