1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (13:09 IST)

కేంద్ర కేబినెట్ కమిటీల్లో మార్పులు : కిషన్ - స్మృతిలకు చోటు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ కమిటీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత కేబినెట్ కమిటీలను పునర్వ్యవస్థీకరణపై ద‌ృష్టి సారించారు. కేబినెట్ కమిటీలో యువ మంత్రులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
 
ప్రధాని మోడీ నేతృ‌త్వంలోని రాజకీయ వ్యవహారాల కమిటీలో కేంద్ర మంత్రులు స్మృతి ఇరాని, భూపేందర్ యాదవ్, సర్బానంద సోనోవాల్‌‌కు చోటు కల్పించారు. అలాగే, ప్రధాని నేతృత్వంలోని ఉద్యోగాల కల్పన, స్కిల్ డెవలప్‌‌మెంట్ కేబినెట్ కమిటీలో అశ్విన్ వైష్ణవ్, భూపేందర్ యాదవ్, రామచంద్ర ప్రసాద్ సింగ్, కిషన్ రెడ్డిలకు అవకాశం కల్పించారు.
 
ఇకపోతే, పెట్టుబడులు, అభివృద్ధి కేబినెట్ కమిటీలో మోడీ, అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు నారాయణ్ రాణే, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్‌‌లకు స్థానం దక్కింది. 
 
అలాగే, పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీలో కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్, కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్‌‌కు స్థానం కల్పించారు. ఇక కీలకమైన కేబినెట్ సెక్యూరిటీ కమిటీలో ఎలాంటి మార్పులు చేయలేదు.