1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (10:08 IST)

ఆ జోన్‌లో పార్కింగ్ చేసిన వాహనాలను ఫోటో తీసి పంపితే బహుమతి

no parking board
కేంద్ర రవాణా శాఖామంత్రి నతిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ పార్కింగ్‌పై ఉక్కుపాదం మోపనున్నట్టు చెప్పారు. నో పార్కింగ్ జోన్‌లో వాహనాలను పార్కింగ్ చేస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పైగా, నో పార్కింగ్ జోన్‌లో పార్కింగ్ చేసిన వాహనాలను ఫోటో చేసి పంపింతే, వాహనాలకు విధించే జరిమానాలో సగం అపరాధాన్ని ఫోటో తీసి పంపిన వ్యక్తికి నజరానాగా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇందుకోసం కొత్త చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. 
 
రోడ్లపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీనికితోడు అనేక మంది వాహనదారులు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. నో పార్కింగ్ జోన్‌లలో కూడా తమ వాహనాలను నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలకు ప్రధాన కారణమయ్యే వాహనదారులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు. 
 
ఇందుకోసం కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఓ చట్టాన్ని తీసుకుని రావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా, రాంగ్ పార్కింగ్ లేదా నో పార్కింగ్ ఏరియాల్లో పార్కింగ్ చేసిన వాహనాలను ఫోటో తీసి అధికారులకు పంపిస్తే ఆ వాహనానికి విధించే జరిమానాలో సగాన్ని ఫోటో పంపిన వ్యక్తికి ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 
 
ఫోటోలను పంపించే వ్యక్తులకు నజరానా ఇవ్వడాన్ని కూడా చట్టంలో పొందుపరుస్తామని తెలిపారు. అపుడే అక్రమ పార్కింగ్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. అనేక మంది తమ ఇళ్ళవద్ద వాహనాలకు పార్కింగ్ స్థలాన్ని కేటాయించకుండా రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని మంత్రి తెలిపారు.