1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (09:03 IST)

సూసైడ్ బాంబర్లు నిజమైన హీరోలు : ఆప్ఘన్ హోం శాఖామంత్రి

తమ ఉన్మాద చర్యలతో అనేక మంది ప్రాణాలు బలితీసుకుంటున్న సూసైడ్ బాంబర్లను ఆప్ఘనిస్థాన్ దేశ పాలకులు నిజమైన హీరోలుగా అభివర్ణిస్తున్నారు. పైగా, సూసైడ్ బాంబర్లపై ప్రశంసల వర్షం కురిపించడంతోపాటు రివార్డులు కూడా ప్రకటిస్తున్నారు. 
 
ఈ మధ్యకాలంలో ఆ దేశంలో జరిగిన ఆత్మాహుతి దాడులతో వందలాదిమంది ప్రాణాలను బలిగొంటున్నారు. ఆ దేశంలో జరుగతున్న సూసైడ్ దాడులతో పలువురు సూసైడ్ బాంబర్లు పాల్గొంటున్నారు. వీరిపై తాలిబన్ మంత్రి ప్రశంసలు కురిపించారు. 
 
ఈ సూసైడ్ బాంబర్లు అమరవీరులంటూ కొనియాడారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆఫ్ఘన్ హోంశాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
సూసైడ్ బాంబర్ల త్యాగాలు ఎనలేనివని ప్రశంసించారు. వారు ఈ దేశానికి, ఇస్లాంకు హీరోలని అభివర్ణించారు. వారి కుటుంబాలకు 10,000 ఆఫ్ఘానీలు (125 డాలర్లు), ఓ ఫ్లాట్ ఇస్తామని మంత్రి ప్రకటించినట్టు స్థానిక మీడియా ప్రముఖంగా ప్రచురించింది.
 
కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో షియా ముస్లింలే లక్ష్యంగా ఇటీవల వరుస ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి. ఈ నెల 8న కుందుజ్ ప్రావిన్స్‌లో, 15న కాందహార్‌లోని షియా మసీదులో జరిగిన ఆత్మహుతి దాడుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. షియా ముస్లింలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.