శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (16:42 IST)

370 అధికరణ రద్దు : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

జమ్మూ కాశ్మీరులో సాధారణ పరిస్థితులు మెరుగయ్యేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జమ్మూకాశ్మీర్ ‌పరిస్థితి అత్యంత సున్నితమైందని, ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. 
 
ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూ కాశ్మీరులో ఆంక్షలు విధించారని సుప్రీంకోర్టులో తెహసీన్ పూనవాల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. జమ్మూ కాశ్మీరులో చోటుచేసుకొన్న పరిస్థితులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరుణ్ మిశ్రా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకొన్నారు. 
 
జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో రోజు రోజుకు పరిస్థితులు మెరుగు పడుతున్నట్టుగా వేణుగోపాల్ కోర్టుకు వివరించారు. ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు కేంద్రం చర్య
లు తీసుకొంటుందని అటార్నీ జనరల్ చెప్పారు. 
 
సాధారణ పరిస్థితులు నెలకొంటే ఆంక్షలు ఎత్తివేస్తామని కోర్టుకు అటార్నీ జనరల్ వివరించారు. 2016లో మూడు మాసాల పాటు ఆంక్షలు విధించిన విషయాన్ని వేణుగోపాల్ గుర్తు చేశారు. ఈ సమయంలో 47 మంది మృత్యు వాత పడ్డారని అటార్నీ జనరల్ సుప్రీంకు తెలిపారు. 
 
జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో ప్రజల హక్కుల రక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీరులో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రానికి సమయాన్ని ఇవ్వాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
 
ఈ విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోవడం తొందరపాటే అవుతోందని సుప్రీం వ్యాఖ్యానించింది. పరిస్థితుల్లో మార్పులు రాకపోతే అప్పుడు తాము జోక్యం చేసుకొంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.