1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Supreme Court warns govt against monitoring social media

ప్రజల గళాన్ని విందాం... అణిచివేస్తే ధిక్కరణ చర్యలే : సుప్రీంకోర్టు

Supreme Court
దేశంలో కరోనా వైరస్ సునామీ విరుచుకుపడిన తరుణంలో సామాజిక మాధ్యమాలు లేదా ఇతర విధాలుగా సాయం కోరేవారిపై చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ప్రజల గళాన్ని విందామని, సమాచారాన్ని అణచిపెట్టవద్దని కోరింది. 
 
మన దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు 70 ఏళ్ళనాటివని, ప్రస్తుత ప్రొసీడింగ్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వాలను కానీ విమర్శించడానికి కాదని వివరించింది. కేవలం ప్రజల ఆరోగ్యం పట్ల మాత్రమే తాము శ్రద్ధ చూపుతున్నామని, తప్పొప్పులను నిర్ణయించేందుకు కాదని స్పష్టం చేసింది. 
 
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా, మందుల సరఫరా, వ్యాక్సినేషన్ విధానం వంటివాటికి సంబంధించిన సమస్యలపై ఏప్రిల్ 22న సుప్రీంకోర్టు సుమోటాగా పరిగణించి విచారణకు చేపట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన విచారణలో, కోవిడ్-19 సోకిన ఆరోగ్య సేవల సిబ్బందికి చికిత్స చేయడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 
 
సాధారణ పౌరుడిగా, న్యాయమూర్తిగా ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ప్రజలు తమ సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా చెప్పుకుంటే, ఆ సమాచారాన్ని తొక్కిపెట్టాలని తాము కోరుకోవడం లేదన్నారు. ప్రజల గళాలను విందామన్నారు. ఆసుపత్రిలో పడకను కానీ, ఆక్సిజన్‌ను కానీ కోరిన వ్యక్తులను హింసించరాదని, అటువంటివారిని హింసించడాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించారు. 
 
ప్రస్తుతం మానవాళి సంక్షోభంలో ఉందన్నారు. ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా తమ సమస్యలను చెప్పుకున్నపుడు, వారు చెప్తున్న మాటలు పూర్తిగా తప్పు అని ముందుగానే భావించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడం కోసం ఆసుపత్రులు, దేవాలయాలు, మసీదులు, ఇతర మతపరమైన ప్రదేశాలను అందుబాటులో ఉంచాలని తెలిపింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తన వాదనను అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది. 
తర్వాతి కథనం
కరోనా రోగుల కోసం అంబులెన్స్ డ్రైవరుగా కన్నడ నటుడు!