గొంతునొప్పి అని భూతవైద్యుడి వద్దకు వెళ్తే.. గదిలోకి తీసుకెళ్లి అరగంట పాటు రేప్
ఆధునికత పెరిగినా కొందరు మనుషుల్లో మార్పు రాలేదు. భూతవైద్యం పేరుతో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దొంగ తాంత్రికుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 12 ఏళ్ల బాలిక కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతోంది.
కనీసం భోజనం కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. తల్లిదండ్రులు హాస్పిటల్కు కూడా తీసుకెళ్లారు. కానీ ఎలాంటి ఉపశమనం లభించలేదు. దీంతో ఏదో మంత్రం వల్లే గొంతునొప్పి వస్తుందని బాలిక కుటుంబ సభ్యులు.. మధ్యప్రదేశ్లోని నివారీలోని సినౌనియా గ్రామానికి చెందిన హర్భజన్ అనే వ్యక్తి భూతవైద్యుడిని సంప్రదించారు. అతడు ఆ బాలికకు దెయ్యం పట్టిందని నమ్మించాడు. ఆ తర్వాత ఆ తాంత్రికుడు ఆ బాలికను ఒక గదిలోకి తీసుకెళ్లాడు.
కొంతసేపటి తర్వాత ఆ బాలిక ఏడవడం ప్రారంభించింది. కానీ అతను ముందుగానే చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు లోపలికి వెళ్లలేదు. అయితే అరగంట తర్వాత తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది.
తాంత్రికుడు తన బట్టలు విప్పించి, తన శరీరంపై నిమ్మకాయ రుద్దాడని, అసభ్యకరమైన పనులు చేశాడని ఆమె చెప్పింది. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్కు గురైంది. వెంటనే భయపడి వారు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని తెలిపారు.