1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మే 2022 (11:46 IST)

పంజాబ్‌లో సంచలనం.. అవినీతి మంత్రిని అరెస్టు చేయించిన సీఎం భగవంత్

bhagwant mann
ఆమ్ ఆద్మీ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒటైన పంజాబ్ రాష్ట్రంలో సంచలనం చోటుచేసుకుంది. తన మంత్రివర్గ సహచరుల్లో ఒకరు అవినీతికి పాల్పడ్డారని తెలిసిన మరుక్షణమే ఆయన్ను మంత్రి వర్గం నుంచి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ తొలగించారు. అంతటితో ఆయన ఊరుకోలేదు. ఆయనపై అవినీతి కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ ఆదేశించారు. అంతే.. సీఎం ఆదేశాలను శిరసావహించిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అవినీతి మాజీ మంత్రిని అరెస్టు చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
పంజాబ్ రాష్ట్రంలో కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై కేవలం రెండు నెలలు మాత్రమే అయింది. ఈ రెండు నెలల్లోనే ఓ అవినీతి మంత్రిని గుర్తించి ఇంటికి పంపించారు. ఇది జాతీయ స్థాయిలో సంచలనం కలిగించింది. వైద్య శాఖలో వైద్య పరికాల కొనుగోళ్ల టెండర్లలో తనకు ఒక శాతం కమిషన్ వాటా ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి విజయ్ సింగ్లా డిమాండ్ చేశారు. 
 
ఈ విషయం ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన గుట్టుచప్పుడు కాకుండా నిఘా వేశారు. తన నిఘాలో తన కేబినెట్ సహచరుడు సింగ్లా ఒక్కశాతం వాటా అడిగిన విషయాన్ని పక్కా ఆధారాలతో గుర్తించారు. అంతే.. ఆయన్ను తన చాంబర్‌కు పిలిచి చీవాట్లు పెట్టి మంత్రి పదవి నుంచి తొలగించారు. తన ప్రభుత్వంలో ఒక్క శాతం అవినీతిని కూడా సహించబోనని తేల్చి చెప్పారు. 
 
అంతేకాకుండా సింగ్లాపై కేసు నమోదు చేయాలంటూ ఏసీబీకి సిఫార్సు చేశారు. సీఎం సిఫార్సు నేపథ్యంలో ఏసీబీ అధికారులు అవినీతి మంత్రిని అరెస్టు చేశారు. ఈ పరిణామంపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అవినీతి విషయంలో ఏమాత్రం ఉపేక్షించకుండా, మంత్రిని సైతం తొలగించిన సీఎం భగవంత్ మాన్ సింగ్ నిబద్ధత తనను కలిచివేసిందని, కళ్ళలో నీళ్లు తిరిగాయని పేర్కొన్నారు. "భగవంత్.. నీ పట్ల గర్విస్తున్నాను. ఆప్‌ను చూసి ఇవాళ దేశమంతా గర్విస్తుంది" అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.