1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (17:16 IST)

ఆ పది రాష్ట్రాల్లోనే 70 శాతం యాక్టివ్ కేసులు

దేశంపై కరోనా  వైరస్ పంజా విసిరింది. ఈ వైరస్ ఉధృతి రోజురోజుకూ ఎక్కువైపోతోంది. ప్రతి రోజూ కనీసం మూడన్నర లక్షల మంది కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ సహా 10 రాష్ట్రాల్లోనే సుమారుగా 70 శాతం కేసులు నమోదవుతున్నాయి. 
 
ఈ పది రాష్ట్రాల్లో ఒకే రోజులో నమోదైన కొత్త కరోనా కేసుల్లో 74.53శాతం ఉన్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 1,69,60,172 కు చేరింది. ఒకే రోజు 3.49లక్షల నమోదయ్యాయి. ఇందులో కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, గుజరాత్‌తో పాటు రాజస్థాన్‌ రాష్ట్రాల్లో 74.53శాతం నమోదయ్యాయి.
 
మహారాష్ట్రలో అత్యధికంగా రోజువారీ కొత్త కేసులు 67,160 వెలుగు చూశాయి. ఆ తర్వాత యూపీలో 37,944, కర్ణాటకలో 29,438 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 26,82,751కు పెరిగింది. దేశంలోని మొత్తం కేసుల్లో 15.82శాతంగా ఉందని తెలిపింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, రాజస్థాన్‌, తమిళనాడు, గుజరాత్‌, కేరళల్లోనే 69.94 శాతం యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
 
మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, గుజరాత్‌, తమిళనాడు, రాజస్థాన్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌లో రోజువారీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది మరో వైపు జాతీయ మరణాల రేటు పడిపోతుంది, ప్రస్తుతం 1.13శాతంగా ఉందని పేర్కొంది. నిన్న ఒకే రోజు 2,767 మరణాలు నమోదవగా.. మహారాష్ట్రలో గరిష్ఠంగా 676 మంది కన్నుమూశారు. ఆ తర్వాత ఢిల్లీలో 357 మరణాలు నమోదయ్యాయి.