గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఆలి కోసం ఓడ ఆకారంలో అందమైన ఇంటిని నిర్మించిన భర్త!

ship house
తన ఆలి (భార్య)కోసం తాను పని చేసే అందమైన ఓడ లాంటి ఆకారంలో ఇంటిని నిర్మించాడో భర్త. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఈ ఇల్లు అద్భుతంగా రూపుదిద్దుకుంది. తద్వారా తన భార్య చిరకాల కోరికను భర్త ఎట్టకేలకు నెరవేర్చాడు. ఓడలాంటి అందమైన ఇంటిని నిర్మించి ఆమెకు బహుమతిగా అందించారు. ఓడ రూపంలో ఉన్న ఆ ఇంటిని చూడటానికి స్థానికులు బారులు తీరుతున్నారు. 
 
కడలూరులో సుభాష్, శుభశ్రీ దంపతులు నివసిస్తున్నారు. సుభాష్ కార్గోషిప్ (సరకుల నౌకలో) 15యేళ్ళుగా మెరైన్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. పెళ్లయిన కొత్తలో శుభశ్రీని ఆయన పలు నౌకల్లో విదేశాలకు తీసుకెళ్లాడు. ఆ సందర్భంగా శుభశ్రీ తనకు ఓడలాంటి ఇల్లు కావాలని సుభాష్‌ను కోరుతూ వచ్చింది. చివరకు ఆమె కోరికను తీర్చేందుకు ఆయన నడుం బిగించారు. రెండేళ్లపాటు శ్రమించి నౌకను పోలిని ఇంటిని నిర్మించారు. 
 
కడలూరు వన్నారపాళయం ప్రాంతంలో 11 వేల చదరపుటడుగుల స్థలాన్ని కొనుగోలు చేసి నాలుగువేల చదరపుటడుగుల విస్తీర్ణంలో నౌకను పోలిన ఇంటిని నిర్మించారు. శుక్రవారం ఆ నౌకాగృహ ప్రవేశ కార్యక్రమాన్ని బంధువుల సమక్షంలో ఆట్టహాసంగా నిర్వహించారు. ఈ నౌకాగృహం చుట్టూరా నీళ్లు నిలిచే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేపట్టారు. ఇంట్లోకి వెళితే అందరికీ నౌకలో ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. ఆరు గదులు ఉన్న ఆ ఇంట్లో చిన్న ఈతకొలను, జిమ్ కూడా ఉన్నాయి. ఇదేవిధంగా షిప్ కెప్టెన్ కూర్చునే గది కూడా ఉంది. 
 
ఇంటి చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాలను తిలకించేలా ఆ కెప్టెన్ గది నిర్మితమైంది. అంతేకాకుండా రాత్రిపూట పెద్దనౌక నీటిపై వెళుతున్న విధంగా స్పెషల్ లైటింగ్స్‌ను ఏర్పాటుచేశారు. సముద్రతీరానికి చేరువగా తుఫాన్లకు, వరదలకు నెలవైన కడలూరు వద్ద ఓ భారీ నౌకలాంటి ఇంటిని నిర్మించిన మెరైన్ ఇంజనీర్ సుభాష్‌ను స్థానిక ప్రజలంతా ప్రశంసిస్తున్నారు. గృహ ప్రవేశం జరిగిన ఆ నౌకా ఇంటిని చూడటానికి స్థానికులు బారులు తీరుతున్నారు.