శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (14:18 IST)

రామమందిర నిర్మాణానికి ముస్లింలు సహకరించాలి : రాందేవ్

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముస్లింలు సహకరించాలని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా విజ్ఞప్తి చేశారు. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించిన నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, 'సుప్రీం తీర్పు చారిత్రాత్మకం. మతాలు వేరైనా మనమంతా రాముడి వారసులమే. ఇక అయోధ్య వివాదాలన్నీపరిష్కారమైనట్లే. దేశంలో శాంతి కొనసాగాలి. శాంతి, సామరస్యాలు నెలకొనేలా మీడియా వ్యవహరించాలి. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి హిందువులకు ముస్లింలు సహకరించాలి'  అని రాందేవ్ బాబా అన్నారు. 
 
అలాగే, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందిస్తూ, 'అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు ఏ ఒక్కరి విజయమో, ఓటమో కాదు. ప్రతి ఒక్కరూ శాంతి, సంయమనంతో వ్యవహరించాలి. మసీదు, మందిరం పక్కనే ఉన్నా ఎలాంటి సమస్య ఉండబోదు. దేశ అత్యున్నత న్యాయస్థాన తీర్పును అనుసరిస్తాం. భారతీయులను హిందు, ముస్లింలు అంటూ రెండు వర్గాలు చూడబోము' అని వ్యాఖ్యానించారు.