1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (09:40 IST)

ఖాకీ క్రౌర్యం : ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళను బెల్టుతో చితకబాదిన ఎస్ఐ!

చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలంలో ఓ మహిళపై ఎస్ఐ తన ప్రతాపాన్ని చూపించాడు. తనపై దాడి చేసినవారిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళను దుర్భాషలాడుతూ బెల్టుతో చితకబాదాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో మహిళ పట్ల ఎస్.ఐ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దుర్భాషలాడినట్టు తేలింది. దీంతో ఎస్.ఐపై బదిలీవేటు పడింది. ఆయన్ను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతి రూరల్ మండలంలోని ఉప్పరపల్లికి చెందిన వనితా వాణి అనే మహిళ ఆటో నడుపుతూ జీవిస్తోంది. శనివారం ఆమె ఇంటి గార్డెన్‌లోకి గేదెలు వచ్చి ధ్వంసం చేశాయి. దీంతో ఆమె గేదెలు బయటకు వెళ్లకుండా తాళం వేసింది. విషయం తెలిసిన గేదెల యజమానులు ఆమెతో వాగ్వివాదానికి దిగి, దాడి చేసి గేదెలను తీసుకెళ్లిపోయారు.
 
దీంతో బాధితురాలు వాణి ఫిర్యాదు చేసేందుకు ఎంఆర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అదేసమయంలో పూజలు చేసేందుకు స్టేషన్ గదులను శుభ్రం చేస్తున్నారు. విషయం తెలియని ఆమె నేరుగా లోపలికి వెళ్లడంతో చూసిన ఎస్ఐ ఆగ్రహంతో ఊగిపోతూ ఆమెను దుర్భాషలాడాడు. ఎందుకలా తిడుతున్నారని ప్రశ్నించడంతో మరింత ఊగిపోయిన ఎస్ఐ ప్రకాశ్ కుమార్ బెల్టుతో ఆమెపై దాడిచేశాడు.
 
ఎస్ఐపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వెళ్తే ఆయన లేరని తెలిసి మళ్లీ స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగింది. విషయం తెలిసిన సీఐ సురేంద్రనాథ్ రెడ్డి స్టేషన్‌కు చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె ధర్నా విరమించింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ విచారణ జరిపించి ఎస్సైపై చర్యలు తీసుకున్నారు.