శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (09:53 IST)

కర్ణాటక మంత్రి రాసలీలల కేసులో ట్విస్ట్.. ఫిర్యాదు వెనక్కి తీసుకున్న దినేష్.. ఎందుకు?

కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జర్కిఘోళి రాసలీలల సీడీ కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ సంచలన సీడీని బయటపెట్టిన సామాజిక కార్యకర్త దినేష్ కళ్లహళి తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన తరఫున న్యాయవాది పోలీసులను కలిశారు. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన న్యాయవాది.. తన క్లయింట్ దినేష్ కళ్లహళి.. కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జర్కిహోళిపై పెట్టిన కేసును వెనక్కు తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. బాధితురాలి క్షేమం, సమాజం క్షేమం కోసం తాను కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్టు చెప్పారు. 
 
బాధితురాలి ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో దినేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలిని అవమానకరంగా చూస్తున్నారని చెప్పారు.'ఈ కేసులో బాధితురాలికి లైంగిక వేధింపులు ఉన్నాయో, లేదో విచారణ జరపాలని మాత్రమే నా ఫిర్యాదులో కోరా. కానీ, విషయం బూమ్ రాంగ్ అయింది. నా మీద, బాధితురాలి మీద రివర్స్ అయింది. చాలామంది మా ఉద్దేశాలను ప్రశ్నించారు. బాధితురాలిని కాపాడాల్సిన వారు, ఆమెకు మద్దతుగా నిలవాల్సిన వారు ఇలా చేయడం బాధించింది.' అని దినేష్ అన్నట్టు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అందుకే తన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్టు చెప్పారు.
 
కర్ణాటక భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రి రమేష్ జర్కిహోళి ఓ మహిళతో ఆయన రాసలీలలు సాగిస్తున్న వీడియో సీడీ బయటకు రావడంతో పెద్ద దుమారం రేగింది. దీంతో మంత్రి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం బీఎస్ యడియూరప్పకు రెండు రోజుల క్రితం పంపారు. తన వద్దకు ఓ పని కోసం వచ్చిన ఓ మహిళను మంత్రి రమేష్ జర్కిహోళి లైంగికంగా వాడుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. 
 
బెంగళూరులోని ఆర్‌టీ నగరలో నివాసం ఉండే యువతి రాష్ట్రంలోని డ్యామ్‌లను డ్రోన్‌ కెమెరా ద్వారా చిత్రీకరించి డాక్యుమెంటరీ తీసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని ఆశ్రయించింది. దీని కోసం ఆయన లైంగికంగా వాడుకున్నారని ఆరోపణ. దీనికి సంబంధించిన వీడియోను బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త, పౌర హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేష్ కల్లహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు నుంచి విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.