గురువారం, 12 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 జూన్ 2025 (22:58 IST)

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

rajnath
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌లో వైస్ చైర్మన్ పదవిని దాయాది దేశం పాకిస్థాన్‌కు కట్టబెట్టడాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఆక్షేపించారు. ఇదే అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆయన తప్పుబట్టారు. ఇదే అంశంపై ఆయన డెహ్రాడూన్‌లో మాట్లాడుతూ... 
 
అమెరికాలో 9/11 దాడుల అనంతరం ఏర్పాటైన ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌ను వైస్ చైర్మన్‌గా నియమించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. "ఆ దాడికి సూత్రధారి అయిన వ్యక్తికి పాకిస్థాన్ ఆశ్రయం కల్పించిందన్న విషయం అందరికీ తెలుసు. ఇది పాలకు పిల్లిని కాపలా పెట్టినట్టుగా ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ వైఖరి, కార్యాచరణ పద్ధతిని మార్చిందని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. దీనికి తాజా, ఉత్తమ ఉదాహరణ 'ఆపరేషన్ సింధూర్' అని, ఇది భారతదేశ చరిత్రలోనే ఉగ్రవాదంపై జరిగిన అతిపెద్ద చర్య అని ఆయన అభివర్ణించారు.
 
పాకిస్థాన్‌ను ఉగ్రవాదానికి తండ్రి (ఫాదర్ ఆఫ్ టెర్రరిజం)గా అభివర్ణించిన రాజ్‌నాథ్, ఆ దేశం ఎప్పుడూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, వారికి శిక్షణ ఇస్తూ, అనేక రకాలుగా తన గడ్డపై సహాయం అందిస్తోందన్నారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మూలించాలంటే, "ఈ రోజు ప్రపంచంలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చి, ఆశ్రయం కల్పిస్తున్న దేశాలను బహిర్గతం చేయడం కూడా చాలా ముఖ్యం" అని ఆయన నొక్కి చెప్పారు.