శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (14:32 IST)

ప్రశాంతంగా వివాదాస్పద అయోధ్య నగరం

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు గురించి దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కానీ, వివాదాస్పద స్థలం ఉన్న అయోధ్య నగరం మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా తమకు సమ్మతమేనని స్థానిక హిందువులు, ముస్లింలు స్పష్టం చేస్తున్నారు. మందరిమైనా.. మసీదు అయినా ఫర్వాలేదని తమకు శాంతి మాత్రమే ముఖ్యమని వారు చెప్తున్నారు. 
 
'మాకు ఎలాంటి ఉత్కంఠ లేదు. తీర్పు ఎలా వచ్చినా స్థానికులకు ఇబ్బందేం లేదు. కొందరు స్థానికేతరులు మాత్రం గొడవ చేసే అవకాశం ఉంది'  అని ఓ వ్యాపారి అన్నారు. నగరంలోని కొందరు ముస్లింలు రామాలయ నిర్మాణానికి మద్దతు పలకడం విశేషం. 
 
'త్వరలోనే హిందువులకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఇక్కడ పెద్ద రామాలయం నిర్మాణం అవుతుంది' అని ఓ ముస్లిం వ్యాపారి పేర్కొన్నారు. '1992లో ఘర్షణలు చెలరేగినప్పుడు మా దుకాణం మొత్తం ధ్వంసమైంది. కొన్నిరోజులపాటు కుటుంబం మొత్తం పస్తులు ఉన్నాం. మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదు' అని మరో వ్యాపారి అన్నారు. 
 
ఇదిలావుంటే, అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించారు. ఇప్పటికే యూపీలో అధికారులకు సెలవులను రద్దు చేశారు. సుప్రీంకోర్టు ఈ నెల 17లోగా తుది తీర్పు వెల్లడిస్తుందని అంచనా.