శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 జనవరి 2023 (11:48 IST)

వార్షిక బడ్జెట్ సిద్ధం... పక్కా మిడిల్ క్లాస్ బడ్జెట్ అంటూ ప్రచారం

nirmala
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‍‌ను తయారు చేశారు. ఇది పక్కా మిడిల్ క్లాస్ బడ్జెట్‌గా రూపొందించినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సగటు వేతన జీవికి భారీ ఊరట కలిగించేలా రూపొందించినట్టు సమాచారం. మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌ను తయారుచేసినట్టు విత్తమంత్రి ఇటీవలే సెలవిచ్చారు. 
 
వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని వేతన జీవులకు ఊరట కలిగించేలా ఆదాయపన్ను పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే, ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఈ దఫా సంక్షేమానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తుందన్న ఆశలో ఉన్నారు. కొత్త పన్ను విధాంలో పన్ను రేట్లను తగ్గించి కొత్త పన్ను స్లాబ్‌లను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. 
 
అయితే, దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పాత పన్ను విధానానికి అదనంగా 2021లో కొత్త పన్ను వ్యవస్థను తీసుకొచ్చింది. పాత పన్ను విధానంలో 3 స్లాబ‌్‌లే ఉండగా కొత్త పన్ను విధానంలో ఆరు స్లాబ్‌లు ఉన్నాయి. 
 
రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయంపై రూ.5 శాతం పన్ను, రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10 శాతం పన్ను, రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం, రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు రూ.25 శాతం, రూ.15 లక్షలకు పైగా ఆదాయం కలిగిన వారికి 30 శాతం పన్ను విధిస్తుంది. అందుకే ఈ దఫా బడ్జెట్‌లో మధ్య తరగతికి పెద్ద పీట వేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం.