శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జులై 2020 (10:52 IST)

'వదిన గారి అప్పడం' తింటే కరోనా మాయం : సెలవిచ్చిన కేంద్ర మంత్రి

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. కానీ, కొందరు రాజకీయ నేతలు మాత్రం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అలాగే, వైరస్ సోకినప్పటికీ.. ఐసోలేషన్‌లో ఉండకుండా, స్వేచ్ఛగా ప్రజల మధ్య తిరుగుతున్నారు.
 
అంతేకాకుండా, కరోనా విషయంలో ఎవరూ ఎలాంటి తప్పుడు సమాచారం వ్యాపింపచేయరాదని ఓవైపు ప్రభుత్వాలు, మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పదే పదే మొత్తుకుంటున్నాయి. అయినప్పటికీ కొందరు మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. 
 
తాజాగా, కేంద్ర మంత్రి ఒకరు... అప్పడం తింటే కరోనాను జయించవచ్చని సెలవిచ్చారు. ఆయన పేరు అర్జున్ రామ్ మేఘ్వాల్. కేంద్ర జలవనరులు, నదీ అభివృద్ధి, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి.
 
అది కూడా మామూలు అప్పడం కాదట.. 'భాభీజీ పాపడ్' (వదిన గారి అప్పడం) అనే బ్రాండెడ్ అప్పడం అయితేనే కరోనాతో సమర్థంగా పోరాడుతుందని సెలవిచ్చారు. ఈ అప్పడం తింటే ఒంట్లో కావాల్సినన్ని యాంటీబాడీలు తయారవుతాయని, దాంతో కరోనాపై కత్తిదూయవచ్చని వివరించారు. 
 
ఈ 'భాభీజీ అప్పడం' గురించి ప్రత్యేకంగా చెబుతూ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వదిలారు. అయితే దీనిపై విమర్శలు మామూలుగా రాలేదు. రకరకాల కామెంట్లతో నెటిజన్లు ఆడుకున్నారు. సోషల్ మీడియాలో దీనిపై జోకులు, మీమ్స్ భారీ స్థాయిలో దర్శనమిస్తున్నాయి.