బుధవారం, 18 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (16:41 IST)

చెల్లి శవాన్ని ఐదు కిలోమీటర్లు భుజాన మోసుకెళ్లిన అన్నలు!!

deadbody
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్‌లో గుండెలను పిండేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయిన తన చెల్లి శవాన్ని ఇద్దరు అన్నలు ఐదు కిలోమీటర్ల దూరం భుజనా వేసుకుని ఎత్తుకెళ్లారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదాకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని పాలియాలో శివానీ అనే బాలిక తన ఇద్దరు సోదరులతో కలిసి నివసిస్తూ 12వ తరగతి చదువుతోంది. రెండు రోజుల కిందట శివానీ టైఫాయిడ్ బారినపడింది. ఆమెను సోదరులు స్థానిక వైద్యుడికి చూపించగా మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించారు. కానీ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పాలియాలోని రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. 
 
శారదా నది ఉప్పొంగడంతో జిల్లా కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. వాహన రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈలోగా ఆమె పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే దారిలో మరణించింది. దీంతో ఇక చేసేదిలేక సోదరులు విలపిస్తూనే ఆమె మృతదేహన్ని 5 కిలోమీటర్లమేర భూజాన మోసుకుంటూ తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.
 
ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తీశాడు. ఆ వీడియోలో రైలు పట్టాల పక్క నుంచి సోదరి మృతదేహాన్ని అన్నలిద్దరూ తీసుకెళ్లడం కనిపించింది. ఆ పరిసర ప్రాంతాలను వరద ముంచెత్తినట్లు ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అధికార వ్యవస్థ ఇలా పనిచేస్తోందని ఓ యూజర్ విమర్శించారు.