1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (14:06 IST)

ఉత్రా కేసు: పాముతో కరిపించి హత్య.. భర్తకు రెండు జీవిత ఖైదులు

కేరళలో గతేడాది సంచలనం సృష్టించిన ఉత్రా అనే వివాహిత హత్య కేసులో దోషిగా తేలిన ఆమె భర్త సూరజ్‌కు కొల్లాం అడిషనల్ సెషన్స్ కోర్టు రెండు జీవిత ఖైదులు విధిస్తూ బుధవారం నాడు తీర్పు వెలువరించింది. 
 
ఈ శిక్షతో పాటు పాముతో కరిపించి హత్య చేసినందుకు మరో పదేళ్లు, సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించినందుకు మరో ఏడేళ్లు కఠిన కారాగార శిక్షను విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. దీంతో.. పాటు సూరజ్‌కు రూ.5 లక్షల జరిమానా విధించింది. కోర్టు తీర్పు వెలువరించడంతో ఉదయం 11.40కి కొల్లాం జిల్లా జైలుకు సూరజ్‌ను తరలించారు.
 
ఈ కేసులో తీర్పుపై కేరళ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూశారు. భార్యను అంత కుట్ర పన్ని చంపిన ఆమె భర్తకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. అనుకున్నట్టుగానే కోర్టు అతను జైలు గోడల మధ్య మగ్గిపోయేలా తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి ఈ తీర్పు చదువుతున్న సందర్భంలో సూరజ్ నోట మాట రాలేదు.
 
గతంలో ఇలాంటి కేసుల్లో నిందితులకు విధించిన శిక్షలను ఉదహరిస్తూ ఈ తీర్పును న్యాయమూర్తి చదివారు. సోమవారం నాడే ఉత్రా హత్య కేసులో ఆమె భర్త సూరజ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.మోహన్‌రాజ్ సూరజ్‌కు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. 
 
ఉత్రా తల్లిదండ్రులు కూడా తమ కూతురిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్న సూరజ్‌కు ఉరే సరి అని చెప్పారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం.. కోర్టు ఘటన జరిగిన ఒక సంవత్సరం, ఐదు నెలల నాలుగు రోజుల తర్వాత తీర్పును వెలువరించింది.