1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (12:48 IST)

వచ్చే నెల 13న చంపేస్తాం.. చేతనైతే రక్షించుకో : రాజస్థాన్ జడ్జికి బెదిరింపులు

ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలో ధన్‌బాద్ జిల్లా జడ్జిని మైనింగ్ మాఫియా ఆటోతో ఢీకొట్టించి హత్య చేసింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇపుడు రాజస్థాన్ కోర్టు జడ్జికి బెదిరింపు లేఖ వచ్చింది. 
 
'మీ వల్ల నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు. అందుకే మిమ్మల్ని సెప్టెంబరు 13న హత్య చేస్తున్నాం. మీ ఇంటిని బాంబులతో పేల్చేద్దామనుకున్నాను కానీ, మీ కుటుంబ సభ్యుల వల్ల నాకు హాని లేదు కాబట్టి ఆ ఆలోచన విరమించుకున్నా. తుపాకితో కాల్చిగాని, విషమిచ్చి కానీ, వాహనంతో ఢీకొట్టి కానీ.. ఏదో రకంగా మిమ్మల్ని చంపేస్తా. కోర్టులో నిందితుడికి మీరు ఎలా అయితే అవకాశం ఇస్తారో, మేం కూడా రక్షించుకునేందుకు మీకు అవకాశం ఇస్తున్నాం. ఈ విషయమై పోలీసులకూ సమాచారం ఇచ్చాం. చేతనైతే రక్షించుకోండి' అంటూ రాజస్థాన్‌లోని బూందీ జిల్లా సెషన్స్ జడ్జి సుధీర్ పారికర్‌కు అజ్ఞాత వ్యక్తి ఒకరు లేఖ రాశాడు.
 
హిందీలో రాసిన ఈ లేఖలో జడ్జికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయనకు భద్రత పెంచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లేఖ రాసిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు.