గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

సోనియా కుటుంబానికి ఎస్‌పీజీ భద్రత ఉపసంహరణ..రాహుల్ థాంక్స్

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా కుటుంబానికి ఎస్‌పీజీ (స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్) రక్షణను ఉపసంహరించాలని కేంద్రం తాజాగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం వారికున్న ఎస్‌పీజీ భద్రతను ఉపసంహరించి, జడ్ ప్లస్ కేటిగిరి భద్రత కల్పించనున్నట్టు ప్రభుత్వ వర్గాల తాజా సమాచారం. ప్రధాని, రాష్ట్రపతికి మాత్రమే ఎస్‌పీజీ భద్రత ఉంటుందని తెలుస్తోంది.

ఈ మేరకు ఎస్‌పీజీ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. కాగా, గాంధీ కుటుంబానికి ఎస్‌పీజీ భద్రత ఉపసంహరణ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సి ఉంది.
 
ఎస్పీజీ బలగాలకు రాహుల్ థాంక్స్
కేంద్ర ప్రభుత్వం ఏఐసీసీ చైర్ పర్సన్ సోనియా గాంధీతో పాటు వారి కుటుంబానికి స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ సెక్యూరిటీని ఉపసంహరించుకోనుందని కథనాలు వెలువడ్డాయి. కాగా దీనిని ధృవీకరించేలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు.

ఎన్నో సంవత్సరాలుగా అవిశ్రాంతంగా తనను, తన కుటుంబాన్ని కాపాడినందుకు ఎస్పీజీకి ధన్యవాదాలు తెలుపుతూ వారి అంకితభావాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశారు.

ఎస్పీజీ మద్దతు మరవలేనిదని.. ఎస్పీజీతో ప్రయాణం ప్రేమమయంగా, కొత్త విషయాలు నేర్చుకునేలా సాగిందని, వారి రక్షణ పొందడం గౌరవంతో కూడుకున్నదంటూ పేర్కొన్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బలగాల్లో తమ కోసం పనిచేసిన వారిని సోదరసోదరీమణులంటూ వారికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.