శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By సెల్వి

నవరాత్రిని ఎందుకు జరుపుకోవాలంటే..? ఘటస్థాపనకు ముహూర్తం ఇదే..

''నవ'' అనే పదానికి కొత్త, తొమ్మిది అనే రెండు అర్థాలున్నాయి. శంభుడు, నిశంభుడిని సంహరించేందుకు దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి పదో రోజున ఆ రాక్షసులపై విజయం సాధించింది. అందుకే నవరాత్రుల్లో తొమ్మిది రోజులతో పాటు పదవ రోజున విజయ దశమిని జరుపుకుంటారు. విజయదశమి రోజునే రావణాసురుడిని శ్రీ రాముడు వధించాడని పురాణాలు చెప్తుంటాయి.
 
శంభుడు, నిశంభుడు అనే రాక్షసులు బ్రహ్మదేవుని నుంచి తమకు మరణం లేని వరం కావాలని కోరుకుంటారు. అయినప్పటికీ తమకు సమమైన, ధైర్యవంతురాలైన, శక్తిమంతురాలైన మహిళ చేతిలో తమకు మరణం సంభవించాలని కోరుకుంటారు. బ్రహ్మదేవుడు ఆ వరాలను రాక్షసులకు ప్రసాదిస్తాడు. ఈ వరాల మహిమను గుర్తించని శంభు, నిశంభులకు గర్వం తలకెక్కి... దేవతలను హింసించడం మొదలెట్టారు.
 
కానీ వారి అరాచకాలకు మట్టుబెట్టేందుకు ఆదిపరాశక్తి కౌశిక, కాళికా, కళరాత్రిగా ఉద్భవించింది. కాళికా దేవికి సహాయంగా ముగ్గురమ్మల రూపమైన అష్టమాధులు, అష్టరాత్రులుగా ఉద్భవించారు. బ్రాహ్మణి అనే బ్రహ్మశక్తి హంస వాహనంలో, కమండలంతో వైష్ణవి అనే విష్ణు శక్తి గరుడ వాహనంలో, శంఖుచక్రాలు, తామరపువ్వులు మహేశ్వరి అనే రూపంలో వృషభ వాహనంలో త్రిశూలం, వరముద్రతో, కౌమారి అనే కార్తీకేయ శక్తి వేలాయుధంతో మహేంద్ర రూపంలో ఇంద్రుని శక్తితో ఐరావతంలో వజ్రాయుధంతో వరాహిగా, చాముండేశ్వరిగా, నారసింహినిగా ఆయుధాలతో కమల పీఠంలో నవరాత్రి దేవతలు ఉద్భవించింది. ఈ దుర్గాదేవి శంభుడు, నిశంభులను సంహరించింది. దీంతో రాక్షసుల బారి నుంచి తప్పించుకున్న దేవతలు మహిషాసుర మర్దిని అయిన దేవదేవిని స్తుతించారు. అందుకే దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు.
 
ఈ ఏడాది నవరాత్రులు అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమై.. అక్టోబర్ 25వ తేదీతో ముగియనున్నాయి. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గమ్మను తొమ్మిది అవతారాల్లో కొలుస్తారు. ఇక నవరాత్రుల్లో తొలిరోజు జీడిపప్పుతో హల్వాను నైవేద్యంగా సమర్పించుకోవాలి. నవరాత్రులు ప్రారంభమయ్యే తొలి రోజున శైలపుత్రీ దేవిని పూజించాలి. ఆ రోజున అమ్మవారికి జీడిపప్పు హల్వా, పూరీ, సజ్జతో అప్పాలు, చలిమిడి, వడపప్పు, పరమాన్నం, బియ్యం రవ్వతో చేసిన పాయసం సమర్పించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. 
 
అలాగే తొలి రోజు నవరాత్రి పూజ, ఘటస్థాపన చేయాలి. అక్టోబర్ 17 అంటే శనివారం ఉదయం 06:23 గంటల నుంచి 10:12గంటల్లోపు ఘటస్థాపన చేయాలి. ఈ మూడు గంటల 49 నిమిషాల్లో పూజ పూర్తి చేసుకోవాలి. లేదంటే.. ఉదయం 11.43 గంటల నుంచి మధ్యాహ్నం 12.29 గంటల్లోపు ఘటస్థాపన చేసుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.