శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 4 జులై 2015 (14:38 IST)

అమెరికా టు అమరావతి... ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల ప్రసంగం...

ఆంధ్రుల అమరావతి అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల పాత్ర గురించి ఆంధ్రప్రదేశ్ సభాపతి గౌరవనీయులు కోడెల శివప్రసాద్ రావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సి.ఎం. రమేష్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎలమంచిలి శివాజీగారితో ఒక టివి వ్యాఖ్యాత విజయ్ ఒక చర్చా కార్యక్రమం నిర్వహించారు.
 
ఆంధ్రుల మొదటి రాజధాని, శాతవాహనుల పరిపాలన కేంద్రము, పంచారామాలలో ఒకటైన, ధాన్యకటకంగా పేరుగాంచిన, బౌద్ధ, జైన మత కేంద్రంగా, అమరలింగేశ్వర స్వామి ఆలయ నిలయంగా విలసిల్లిన అమరావతి గురించి ఒక అద్భుతమైన ఆడియో విజువల్ ప్రోగ్రాంతో చర్చా కార్యక్రమము మొదలైంది.
 
మొదటగా టివి5 యాంకర్ విజయ్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ముడిపడిందో వివరించారు. తరువాత శ్రీ కోడెల గారు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం, దాని ఆవశ్యకత గురించి మాట్లాడారు. తన ప్రసంగంలో ఆయన వివిధ అంశాలు, రాజకీయ ప్రయోజనాలు కోసం ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తీరు విభజన క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన జరిగిన అన్యాయం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ గురించిన అంశాలపై ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అవమానాలు, ఆటుపోట్లు నుంచి అయినా తిరిగి ఉజ్జ్వల స్థాయికి చేరుకుంటుందన్న ప్రగాఢ ఆశాభావం వ్యక్తపరిచారు. 
 
రాష్ట్రాలు విడిపోయినా, మనుషులు కలిసి వుండాలని, కలిసి ఎదగాలని  ఆకాక్షించారు. ఆంధ్రప్రదేశ్‌కి ఉన్న పురోగతికి, ఉన్న బలాలు- నీటి లభ్యత, సారవంతమైన భూమి, మానవ వనరులు, వివిధ రంగాలలో పేరుగాంచిన, వృత్తి నిపుణులు గురించి ప్రస్తావించారు. ప్రత్యేకించి, రాజధానిగా అమరావతి ఎంపికకు గల కారణాలు, నది అభిముఖం, చారత్రిక ప్రాధాన్యం, రాష్ట్రం మధ్యలో వుండటమని వివరించారు.  
 
రాజధాని నిర్మాణకి 33,000 ఎకరాలు స్వచ్చందంగా ఇచ్చిన రైతుల అద్వితీయమైన సహకారం, ప్రభుత్వం భూ సమీకరణ విధానం, అద్భుతమైన ప్యాకేజ్ గురించి ప్రసంశించారు. సింగపూర్, జపాన్ భాగస్వామ్యం, రాజధానిపై ప్రభుత్వానికున్న స్పష్టమైన విధానం - మూడంచెలుగా రాజధాని నిర్మాణం, కేవలం రాజకీయ రాజధానిగానే కాకుండా, ఒక సాంసృతిక, ఆర్ధిక రాజధానిగా, పెట్టుబడులకు ఆకర్షణీయమైన ప్రాంతంగా అభివృద్ధి చెయ్యాలన్న ప్రభుత్వ దార్శనికత, దృఢ సంకల్పం, సమర్ధవంతమైన నాయకత్వం గురించి ప్రస్తావించారు.
 
ప్రవాసాంధ్రుల సహకారం ఎంతైనా అవసరం ఉందన్నారు. ప్రవాసాంధ్రుల కార్యదక్షత, క్రమశిక్షణ నూతన రాజధాని నిర్మాణానికి తోడ్పడతాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణులు శ్రీ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ అమరావతికున్న నామ బలం, సమర్ధుడైన ముఖ్యమంత్రితో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని మంచి పురోగతి సాధించాలని ఆకాంక్షిచారు. పార్లమెంట్ సభ్యులు సి.ఎం. రమేష్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని నిర్మాణలో ప్రవాసాంధ్రుల సహకారంపై ఉన్నటువంటి అవకాశాలు వివరించారు. ఇతర రాజధానుల అధ్యయన క్రమం తదితర అంశాల గురించి ప్రస్తావించారు.
 
మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎలమంచిలి శివాజీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేకించి క్షేత్రస్థాయి సిబ్బంది, ఎంత తొందరగా హైదరాబాద్ నుంచి మారితే ఆంధ్రప్రదేశ్ పురోగతి, రాజధాని అభివృద్ధికి అంత మంచిదన్న అభిప్రాయాన్ని  వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివిధ ప్రవాసాంధ్రులు పదవీ విరమణ చేసిన ప్రవాస వృత్తి నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.