శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 24 ఆగస్టు 2019 (21:52 IST)

మానవుడికి శత్రువు, మిత్రుడు అదే కనుక... అర్జునుడితో శ్రీకృష్ణుడు

భగవద్గీతలో మానవ జీవితంలో అనుసరించాల్సినవెన్నో వున్నాయి. యుద్ధ సమయంలో అర్జునునికి శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని మాటలు చూద్దాం. '' సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు సమానంగా భావించి సమరం సాగించు. అప్పుడు నీకు ఏ పాపం కలుగదు. తన మనస్సే తనకు మిత్రువూ, శత్రువు కూడా కనుక మానవుడు తనను తానే ఉద్ధిరించుకోవాలి. తన ఆత్మను అధోగతి పాలు చేసుకోకూడదు.
 
శ్రేయోభిలాషి, స్నేహితుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, విరోధి, బంధువు, సాధువు, దురాచారి వీల్లందరిపట్ల సమ బుద్ధి కలిగినవాడే సర్వోత్తముడు. నా మీదే మనసునూ, బుద్ధిని నిలుపు. ఆ తర్వాత తప్పకుండా నీవు నాలోనే నివసిస్తావు. తన వల్ల లేకమూ, లోకం వల్ల తానూ భయపడకుండా సంతోషం, కోపం, భయం, ఆవేశాలకు వశం కాకుండా ఉండేవాడు నాకు ఇష్టుడు.
 
పార్థా! నన్ను ఆశ్రయించేవాళ్ళు ఎవరైనా సరే పాపజన్ములు కానీ, స్త్రీలు కాని, వైశ్యులు కాని, శూద్రులు కాని పరమశాంతిపదం పొందుతారు. పరిశుద్ధమైన మనస్సు కలిగిన వాడు భక్తితో నాకు ఆకు కాని, పువ్వు కాని, పండు కాని, నీరు కాని సమర్పిస్తే సాదరంగా స్వీకరిస్తాను. ఎప్పుడూ శబ్దాది విషయాల గురించి ఆలోచించే వాడికి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆసక్తివల్ల కోరికలు పుడతాయి. కోరికలు కోపం కలిగిస్తాయి.
 
తాబేలు తన అవయావాలను లోపలికి ఎలా ముడుచుకుంటుందో అలాగే ఇంద్రియాలను సర్వవిధాల విషయసుఖాల నుంచి మళ్లించినవాడు స్థితప్రజ్ఞుడవుతాడు. నీ బుద్ధి అజ్ఞానమనే కల్మషాన్ని అధిగమించినపుడు నీకు విన్న విషయాలు, వినబోయే అర్థాలు విరక్తి కలిగిస్తాయి. కర్మలు చేయడం వరకే నీకు అధికారం. కర్మఫలంతో నీకు సంబంధం లేదు. కనుక ప్రతిఫలం ఆశించి కర్మ చేయకు. అలా అని కర్మలు మానడానికి చూడకు."