1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 మే 2022 (11:23 IST)

పరశురామ జయంతి.. మహాభారతంలో ముగ్గురికి గురువు...

Parasurama
Parasurama
పరశురాముడు విష్ణుమూర్తి దశాలతారాల్లో ఆరవ అవతారం. వైశాఖ శుద్ధ తదియ రోజున పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. క్షత్రియుల నుంచి ప్రజలను, భూమిని కాపాడేందుకు పరుశురాముడు అవతరించాడని విశ్వాసం. ఈ రోజున  లక్ష్మీ ఆరాధన చేస్తారు. పవిత్ర తులసి ఆకులు, చందనం, కుంకుమ, పువ్వులను విష్ణువుకు అర్పిస్తారు. అంతేగాకుండా భోగిపండ్లు, పాల ఉత్పత్తులను భక్తులకు దానం చేస్తారు. 
 
సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనుస్సును విరిచిన విషయం తెలిసిన పరశురాముడు తన గురువైన శివుడి విల్లు విరిచినందుకు కోపంతో రాముడిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరథుడు చేసిన అభ్యర్థనలను కానీ, శ్రీరాముని శాంత వచనాలను కానీ పట్టించుకోకుండా చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రాముడికి ఇచ్చాడు. 
 
రాముడు దాన్ని కూడా అవలీలగా ఎక్కుపెట్టాడు. శ్రీరాముడు తాను ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు వదలాలి అని పరశురాముడిని అడిగగా తన తపోశక్తిని కొట్టేయమని చెప్పి తిరిగి మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
 
పరశురాముడు మహాభారతంలో ముగ్గురు వీరులకు గురువయ్యాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్ముడికి అస్త్రశస్త్ర విద్యలు బోధించాడు. అంబికను వివాహం చేసుకోమని పరశురాముడు కోరగా, భీష్ముడు తాను ఆజన్మ బ్రహ్మచర్యవ్రతుడు అయినందుకు నిరాకరించాడు. 
 
దీంతో కోపగించిన పరశురాముడు భీష్ముడితో యుద్ధానికి తలపడ్డాడు. ఇద్దరూ సరిసమానంగా యుద్ధం చేస్తుండటంతో దేవతలు యుద్ధం ఆపమని అభ్యర్థించగా యుద్ధాన్ని నిలిపివేశారు.
 
కర్ణుడు తాను బ్రాహ్మణుడిని అసత్యం పలికి పరశురాముడి దగ్గర శిష్యునిగా చేరి అస్త్ర విద్యలు నేర్చుకుంటున్న సమయంలో నిజం తెలిసిన పరశురాముడు యుద్ధకాలంలో తెలిసిన విద్యలు గుర్తుకు రావు అని కర్ణుడిని శపించాడు. 
 
ద్రోణాచార్యుడు పరశురాముడి దగ్గర దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా పరశురాముడిని దర్శించుకున్నాడు. పరశురాముడు దత్తాత్రేయుడి దగ్గర శిష్యుడిగా చేరి అనేక విద్యలు నేర్చుకున్నాడని స్కాంద పురాణంలో వివరించబడింది.