వరలక్ష్మీ వ్రతం 2026: ఆగస్టు 21, శుక్రవారం నాడు ఇలా పూజిస్తే..?
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. 2026 సంవత్సరంలో వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21, శుక్రవారం నాడు నిర్వహించబడుతుంది. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించి, వ్రత కథను వినడం, తోరాన్ని కట్టుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
వివాహిత మహిళలతో పాటు యువతులు కూడా మంచి భవిష్యత్తు, కుటుంబ సుఖసంతోషాల కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతంలో కలశ స్థాపనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కలశాన్ని అలంకరించి, లక్ష్మీదేవి రూపంగా భావించి పూజిస్తారు. అనంతరం అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకం, వరలక్ష్మీ వ్రత కథను పారాయణం చేస్తారు.
పూజ అనంతరం కుటుంబ సభ్యులకు ప్రసాదం పంచి, సుమంగళులకు తాంబూలం ఇవ్వడం సంప్రదాయం. ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం ఆచరించిన వారికి, దీపారాధన చేసి, దూప దీప నైవేద్యాలు సమర్పించి, దానధర్మాలు చేసి భక్తి, శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన వారికి అష్టలక్ష్ముల ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
వరలక్ష్మీ వ్రతం రోజున స్థిర లగ్నంలో అమ్మవారిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించి, మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో పూజ ముగించడం మంచిది. భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ వరలక్ష్మీ వ్రతం దీపావళి పూజతో సమానమైన ఫలితాలను ఇస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంకా చారుమతి కథను చదవడం, కనకధారా స్తోత్రాన్ని పఠించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి.
