గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 22 జనవరి 2019 (16:02 IST)

ఇలాంటి పుష్పాలే ఆ దేవదేవతలకు సమర్పించాలి...

ఆధ్యాత్మిక ఆసక్తి కలవారు రకరకాల పుష్పాలతో భగవంతుణ్ణి పూజిస్తారు. ఐతే ఈ పుష్పాల్లో కొన్నింటిని కొందరు దేవతలు ఇష్టపడరు. తెలియక చేసిన దానికి పాపమంటకపోయిన మనం చేసే పుణ్యకార్యాన్ని తెలుసుకుని చేయడం ద్వారా ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. తెలిసి ఆచరించిన పూజలు గొప్ప ఫలితాన్నిస్తాయని పెద్దలు చెప్తారు. ఏ భగవంతుడిని ఏ రకమైన పూలతో పూజించాలో తెలుసుకుందాం.
 
1. గణేశునికి ఎర్రని పూలంటే ప్రీతి. సంకటాలు తొలగడానికి గరికెతో పూజిస్తే మంచిది. వినాయక చవితినాడు తప్ప మరెప్పుడు తులసితో ఆయనను పూజించరాదు.
 
2. సరస్వతి మాతకు తెల్లనిపూలు, జాజిమల్లెలు ఇష్టం. ఆ తల్లిని యా కుందేందు తుషార హార దవళా అని స్తుతించడం గమనించవచ్చు. లక్ష్మీ అమ్మవారికి ఈ పూలే ఇష్టం. ఆ తల్లిని ధవళ తరాంశుక గంధమాల్య శోభాం... అని స్తుతిస్తూ ఉంటాం.
 
3. గాయత్రి, దుర్గ, లలిత అమ్మవార్లకు ఎర్రని పూలు ఇష్టం. అరుణమాల్య భూషాంబరాం, జపాకుసుమ భాసురామ్ అనే స్తుతులు వీటిని నిరూపిస్తాయి. లలితాదేవి పాదాల వద్ద ఎర్రని పుష్పాలు, ఎర్ర రాళ్ల కిరీటం, ఎర్రని ఆభరణాలు, ఎర్రని వస్త్రాలు ఉండటం ఆమెకు ఎరుపు పట్ల గల ప్రీతిని తెలియచేస్తాయి.
 
4. శ్రీమన్నారాయణుణ్ణి కదంబ పుష్పాలతో పూజ చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. అగసి పూలతో పూజ చేస్తే పదివేల యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది.
 
5. శ్రీకృష్ణుడు నీలమేఘశ్యాముడే అయినా నీలిరంగు పూలు ఆయన పూజకు పనికి రావు. పున్నాగ, మందార, కావిరేగు, కచ్చూరాలు, ఒకేఒక్క రెక్క ఉండే పూలు కృష్ణ పూజకు పనికి రావు.
 
6. పార్వతీ దేవికి ఉసిరిక ఆకులు ఇష్టం. ఒకమారు వాడిన పులు పూజకు పనికి రావు. తులసి, బిల్వ పత్రాలు, అగస్త్య పుష్పాలు, కోసిన తరువాత ఐదు రోజుల వరకు తాజాగా ఉంటాయి కనుక వీటికి అనిషిద్దం లేదు. 
 
పత్రం వల్ల విదురుడు, ద్రౌపది, ఫలంతో శబరి, తోయంతో రంతిదేవుడు, పుష్పంతో గజేంద్రుడు మోక్షాన్ని పొందారు. పుష్పానికి గల పవిత్రత వల్ల ఎందరో గురువులు పుష్పంతో బహురూప వర్ణనలు, ప్రార్థనలూ చేస్తారు.