సోమవారం, 29 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 4 ఫిబ్రవరి 2021 (17:54 IST)

నాలుగు రాష్ట్రాల్లో గుడికో గోమాత, త్వరలో కల్యాణమస్తు ప్రారంభం: టిటిడి ఛైర్మన్

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతోందని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. విజయవాడ సెంట్రల్ పరిధిలోని సత్యనారాయణపురం లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో గురువారం గుడికో గోమాత కార్యక్రమం నిర్వహించారు. 
 
శ్రీ గాయత్రి సొసైటీ వారు ఆలయానికి కపిల గోవును బహూకరించారు. టీటీడీ చైర్మన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని శాస్త్రోక్తంగా గోపూజ చేసి ఆలయానికి గోవును అందించారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించిందన్నారు. 
 
దేశ వ్యాప్తంగా ఏ ఆలయం అయినా టీటీడీని కోరితే ఈ కార్యక్రమం ద్వారా ఆలయానికి గోమాత, దూడను అందిస్తుందన్నారు. వీటి పోషణ భాద్యత ఆ ఆలయమే తీసుకోవాలని చైర్మన్ చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం టీటీడీ ద్వారా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని ఆయన చెప్పారు.
 
గత ప్రభుత్వం మంగళం పాడిన కళ్యాణమస్తు కార్యక్రమం త్వరలో ప్రారంభించబోతున్నామన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో త్వరలోనే 500 దేవాలయాలను నిర్మిస్తామని తెలిపారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమం ఆలస్యమైందన్నారు.