శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (23:00 IST)

ఇది ప్రజలందరి విజయం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందని దేశ 46వ అధ్యక్షుడుగా ప్రమాణం స్వీకారం చేసిన జో బైడెన్ వ్యాఖ్యానించారు. జో బైడెన్‌తో యూఎస్ సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారీస్ ప్రమాణం చేసి చరిత్ర సృష్టించారు.
 
బైడెన్ ప్రమాణ స్వీకారం తర్వాత దేశాధ్యక్ష హోదాలో ప్రసంగించారు. అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందని అన్నారు. ఇది అమెరికా ప్రజలందరి విజయమన్న బైడెన్.. క్యాపిటల్ హింసతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందని భయపడ్డారన్నారు. 
 
మన దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని, ఎలాంటి వివక్షకు స్థానం లేదని, యుద్ధంకన్నా శాంతిని కోరుకుంటున్నామన్నారు. నాలుగేళ్లలో అమెరికా ప్రజలు అరాచకాన్ని చూశారన్నారు. హింస, ఉగ్రవాదం సమస్యల్ని ఎదుర్కోవాలంటే ఇందుకు మీ అందరి సహకారం కావాలని, ఈ విషయంలో ప్రతి ఒక్క అమెరికా పౌరుడితో కలిసి పనిచేస్తామని బైడెన్ చెప్పుకొచ్చారు.
 
ఇకపోతే, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, వైరస్‌ను తరిమికొట్టడమే తమ ప్రభుత్వ లక్షమని బైడెన్ అన్నారు. కరోనాతో ఆర్థిక రంగం కుదేలైందని, సవాళ్లను ఐకమత్యంగా ఎదురుకుందామని ఆయన దేశ పౌరులకు పిలుపునిచ్చారు.