భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు .. పెరిగిన బంగారం, వెండి ధరలు
బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 213 పాయింట్లు నష్టపోయి 27,040 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 8,171 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే, డాలరుతో రూపాయి మారకం విలువ మళ్లీ రూ.65కు చేరుకుంది. ప్రస్తుతం రూ.65.01 వద్ద కొనసాగుతోంది.
ఈ ట్రేడింగ్లో సిప్లా సంస్థ షేరు అత్యధికంగా 2.52శాతం లాభపడి రూ.701.95 వద్ద ముగిసింది. దీంతో పాటు కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, అంబుజా సిమెంట్స్, ఓఎన్జీసీ సంస్థల షేర్లు లాభపడ్డాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్ షేరు అత్యధికంగా 7.20శాతం నష్టపోయి రూ.484.25 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.
మరోవైపు.. బంగారం, వెండి ధరలు పెరిగాయి. రూ.155 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.27,265కు చేరింది. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,170.65 అమెరికన్ డాలర్లుగా నమోదైంది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల కొనుగోళ్లు మద్దతు లభించడం తదితర కారణాల వల్ల దేశీయంగా ఈ లోహం ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అలాగే వెండి ధర సైతం పెరిగింది. రూ.255 పెరగడంతో కేజీ వెండి ధర రూ.37,350కి చేరింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాలు కొనుగోళ్లు జరపడంతో డిమాండు పెరగిందని దీంతో ఈ లోహం ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.