1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By వాసు
Last Modified: బుధవారం, 10 అక్టోబరు 2018 (16:16 IST)

తెలుగు టైటాన్స్ దెబ్బకు తమిళ తలైవాస్ చిత్తుచిత్తు...

ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో విజయం కోసమై ఎదురుచూస్తూ విసిగివేసారిన తెలుగు టైటాన్స్‌ ఎట్టకేలకు తమ నాలుగో సీజన్‌ను ఘనంగా ఆరంభించిందనే చెప్పవచ్చు. ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న తొలి టైటిల్ పోరాటంలో తమిళ్ తలైవాస్‌పై విజయాన్ని నమోదు చేసుకొని సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. ఆరంభం నుంచే ఆధిక్యం చూపించిన ఈ విజయంలో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి కీలక పాత్ర పోషించాడు.
 
కాగా, తెలుగు టైటాన్స్‌ నుండి రాహుల్‌ చౌదరి, తమళ్ తలైవాస్‌ నుండి అజయ్‌ ఠాకూర్‌ ఇద్దరూ తొమ్మిదేసి రైడ్‌ పాయింట్లతో టాప్‌లో నిలిచారు. జోన్ ‌‘బి'లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి (9 పాయింట్లు), మోసిన్‌ (7 పాయింట్లు), నీలేశ్‌ సోలంకి (5 పాయింట్లు) చెలరేగి ఆడారు.
 
ఆట ఆరంభమైన తొలి పది నిమిషాలు ఇరు జట్లు హోరాహారీగా తలపడినా ఆ తర్వాత రాహుల్‌ చౌదరి ధాటిగా ఆడటంతో తమిళ్‌ తలైవాస్‌ జట్టు ఆలౌటైంది. మ్యాచ్‌ ఆరంభంలో తలైవాస్‌ దూకుడు కనబరిచి పైచేయి సాధించినప్పటికీ ప్రథమార్ధం చివరి ఐదు నిమిషాల్లో 10-9తో ఆధిక్యం సాధించిన టైటాన్స్‌ ఆ తర్వాత తలైవా‌స్‌ను ఏ దశలోనూ కోలుకోనీయకుండా అదే జోరుతో ఫస్టాఫ్‌ను 17-11 తేడాతో ముగించింది.
 
కానీ తమిళ్ తలైవాస్‌ నుండి మంజీత్‌ చిల్లర్‌తో పాటు అజయ్‌ ఠాకూర్‌ విజృంభించడంతో, తలైవాస్‌ 20-24తో టైటాన్స్‌ను సమీపించింది. అయితే, రాహుల్‌ చౌదరి రైడ్‌కు వెళ్లిన దాదాపు ప్రతిసారి పాయింట్‌ తేవడంతో టైటాన్స్‌ ఏ దశలోనూ వెనకబడలేదు. ఆ తర్వాత కూడా టైటాన్స్‌కు ఎలాంటి పోటీ ఎదురుకాకపోవడంతో చకచకా పాయింట్లను పెంచుకుంటూ వెళ్లింది.
 
సెకండాఫ్‌లో తలైవాస్‌ పుంజుకొని పోటీనిచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. తమిళ్‌ తలైవాస్‌ నుండి కెప్టెన్‌ అజయ్‌ ఠాకూర్‌ 9 రైడ్‌ పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్‌లో అమిత్‌ (6 పాయింట్లు) సత్తా చాటాడు. పటిష్ఠమైన డిఫెన్స్‌కు తోడు అద్భుత రైడింగ్‌ ఉండడంతో టైటాన్స్‌పై తలైవాస్‌ ఆటగాళ్లు ఎంతమాత్రమూ ప్రభావం చూపలేకపోయారు.