శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శనివారం, 24 నవంబరు 2018 (09:12 IST)

ఆంధ్రోడి కత్తితో తెలంగాణోడు పొడవాలనుకుంటున్నడు...

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని మరోమారు విమర్శల వర్షం కురిపించాడు. అలాగే, ఆంధ్రోడు చంద్రబాబుతో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలకు కూడా తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. 
 
తెలంగాణ ఎన్నికల కోసం కేసీఆర్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులోభాగంగా భాగంగా, శుక్రవారం వివిధ ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీలను తీవ్రంగా విమర్శలు గుప్పించారు. 
 
కాంగ్రెస్ పార్టీ 70 యేళ్ల తర్వాత చిల్లర రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. గాలి గత్తరగా ఓట్లు వేసి ఆగం కావొద్దు. 58యేళ్ళ పరిపాలనలో జరిగిన పని చూడండి. గత నాలుగున్నరేళ్ళలో తెరాస పాలన చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇవ్వనోడు... తెలంగాణకు వచ్చి తెలివి చూపిస్తున్నాడని అన్నారు. 
 
ఉద్యమ సమయంలో వచ్చిన ఆలోచనలతోనే పథకాలను తెచ్చాం. రైతు బంధు పథకం.. ఈ ప్రపంచంలో ప్రవేశపెట్టిన ఉత్తమ పథకాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిందని కేసీఆర్ చెప్పారు. 
 
ముఖ్యంగా తెలంగాణాకు ప్రాజెక్టు వద్దని చంద్రబాబు ఇప్పటికి కూడా లేఖ రాశాడు. ఇప్పటికీ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నాడు. చంద్రబాబు కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడు. నా వంతుగా ఒక్కసారి చంద్రబాబును తరిమి కొట్టిన. ఈ సారి మీరు చంద్రబాబును తరిమేయాలి. చంద్రబాబు మోసుకొస్తున్న కాంగ్రెస్ వాళ్లను ఓడ గొట్టాలె. కత్తి తెచ్చెటోడు ఆంధ్రోడు. దానితో తెలంగాణాడు పొడవాలని చూస్తున్నాడు. 
 
ఉద్యమంలో చెప్పినమాటే మళ్లీ చెబుతున్నా.. ఇపుడు కూడా వచ్చేటోడు ఆంధ్రా నాయకుడే. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వెన్నుముక లేనోళ్లు. పౌరుషం లేనోళ్లు అని వారికి అవకాశం ఇవ్వొద్దు. ఈ దెయ్యం వదిలించాలంటే బాబును మోసుకొస్తున్నవాడికి బుద్ధి చెప్పాలన్నారు. అలాంటోళ్ళకు అవకాశం ఇవ్వొద్దు. ఏమరుపాటుగా ఉంటే నష్టపోతాం. తెలివైన ఆలోచన చేయాలి అంటూ ఓటర్లకు కేసీఆర్ పిలుపునిచ్చారు.