శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (10:24 IST)

ఎప్పుడొచ్చామన్నది కాదు.. గెలిచామా? లేదా? అనేదే ముఖ్యం...

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ ఓటర్లు కేసీఆర్‌కు మరోమారు పట్టంకట్టారు. మొత్తం 119 సీట్లకుగాను ఏకంగా 88 సీట్లలో విజయభేరీ మోగించింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం గులాబీ మయం అయిపోయింది. అయితే, ఈ ఎన్నికల్లో చివరి నిమిషంలో టిక్కెట్లు దక్కించుకుని విజయాన్ని అందుకున్న వారు లేకపోలేదు. అలాంటివారిలో దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌లు ఉన్నారు. 
 
ఖైరతాబాద్ నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్‌కు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కింది. ఇక్కడ క్లాస్, ఓటర్ల సమ్మేళనం. గత ఎన్నికల్లో భాజపా గెలుచుకున్న ఈ నియోజకవర్గంపై ప్రధానపార్టీలన్నీ దృష్టిసారించాయి. భాజపా అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని నిలిపింది. ప్రజాకూటమి, తెరాస మాత్రం చివర్లో అభ్యర్థులను ప్రకటించాయి. 
 
తెరాస నుంచి ఆశావహులు ఎక్కువమంది ఉండటంతో ఆచితూచి వ్యవహరించారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం దానం నాగేందర్‌ పేరును ఖరారు చేశారు. దీంతో ఆశావహుల నుంచి భిన్న స్పందన ఎదురైంది. గత ఎన్నికల్లో తెరాస తరఫున పోటీచేసి ఓడిన మన్నె గోవర్ధన్‌రెడ్డి రెబల్‌గా మరొపార్టీ నుంచి బరిలోకి దిగారు. త్రిముఖ పోటీలో గెలుపోటముల ఊగిసలాట మధ్య దానం నాగేందర్‌ మంచి మెజార్టీతో గెలుపొందారు. 
 
అలాగే, అంబర్ పేట స్థానం అంటే బీజేపీ నేత కిషన్ రెడ్డిదే. వరుసగా రెండుసార్లు గెలిచిన ఆయనపై బలమైన అభ్యర్థిని నిలిపేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నించాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇక్కడ కాషాయజెండా పక్కా అనేంతటి ధీమా నెలకొంది. అటువంటి చోట తెరాస నుంచి పోటీ చేసేందుకు ముగ్గురు నేతలు ఆసక్తిచూపారు. 
 
వారిలో చివరకు కాలేరు వెంకటేష్‌ను పార్టీ బరిలో నిలిపింది. గతంలో జీహెచ్‌ఎంసీ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేసిన అనుభవం కలిసొచ్చింది. బలమైన ప్రత్యర్థిపై స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. ఇలాగే ముషీరాబాద్ నుంచి పోటీ చేసిన ముఠా గోపాల్, ఎల్.బి నగర్ నుంచి పోటీ చేసిన సుధీర్ రెడ్డిలు కూడా రసవత్తర పోరులో విజయాన్ని సాధించారు.