ఆదివారం, 23 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 నవంబరు 2025 (17:45 IST)

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

iBomma
పైరసీకి పాల్పడినందుకు తన కుమారుడు, 'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలన్న ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌ వ్యాఖ్యలను 'ఐబొమ్మ' రవి తండ్రి అప్పారావు తీవ్రంగా స్పందించారు. సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుందని ఆయన ఘాటుగా బదులిచ్చారు. తన కుమారుడిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సబబు కాదన్నారు. 
 
ఐబొమ్మ రవి చేసిన పైరసీ వల్ల చిత్రపరిశ్రమకు భారీ నష్టం వాటిల్లిందని, అందువల్ల పైరసీకి పాల్పడిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలన్న నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలపై చిత్రపరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
వీటిపై రవి తండ్రి అప్పారావు స్పందిస్తూ, సినిమాలో సరైన విషయం ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లకు వచ్చి చూస్తారు. నేను ఒకపుడు 45 పైసలకే సినిమాలు చూశాను. కానీ ఇపుడు టికెట్ ధరలు దారుణంగా పెంచేశారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి  సినిమాలు ఎవరు తీయమన్నారు అని ప్రశ్నించారు. 
 
చిత్ర పరిశ్రమ తమ తప్పులను సరిదిద్దుకోవాలి తప్ప ఇతరులపై నిందులు వేయడం సరికాదన్నారు. అంతేకాకుండా తన కుమారుడు తరపున కేసు వాదిస్తున్న న్యాయవాదికి తాను ఆర్థికంగా కూడా అండగా ఉంటానని చెప్పారు. ఈ విషయంలో న్యాయపరంగానే ముందుకెళతానని చెప్పారు.