తెలంగాణ అభివృద్ధిలో రాజకీయం లేదు.. మోడీ - షా ద్వయాన్ని కలుస్తా : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎలాంటి రాజకీయాలు ఉండవని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ఎన్నిసార్లైనా కలుస్తానని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆ తర్వాత నిర్మల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
'నిర్మల్ ప్రజలు ఇచ్చిన భరోసా, మద్దతు వల్లే సీఎం అయ్యాను. ఆదిలాబాద్ జిల్లా పోరాటానికి, పౌరుషానికి గడ్డ. జల్, జంగల్, జీమీన్ అంటూ కుమురం భీం కొట్లాడారు. ఈ జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. బాసర ట్రిపుల్ ఐటీలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా ఇందుకు సహకరించాలి.
పారిశ్రామికంగానూ ఆదిలాబాద్ను అభివృద్ధి చేస్తాం. జిల్లాకు ఎయిర్ బస్ తీసుకొస్తాం. ఎయిర్పోర్టు కోసం 10 వేల ఎకరాల భూమిని సేకరించాలి. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిద్దాం. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టాల్సిందే.. ఆదిలాబాద్ జిల్లాకు నీరు ఇవ్వాల్సిందే.
ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధాని వద్దకు వెళ్తున్నాం. ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి.. అడగాల్సిన ప్రాజెక్టులు అడుగుతున్నాం. మోడీని పదే పదే కలుస్తున్నానని కొంత మంది విమర్శిస్తున్నారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు ఎవరు ఇస్తారు.. ప్రధాని కాదా? ప్రధానిని కలవకపోతే నిధులు, ప్రాజెక్టులు ఎలా వస్తాయి. పదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం అడగలేదు. అడగకపోతే రాష్ట్రానికి ఏం కావాలో కేంద్రానికి ఎలా తెలుస్తుంది.
పైరవీలు చేయను.. పర్సనల్ ఎంజెడా లేదు.. రాష్ట్ర అభివృధ్ధి కోసం, నిధుల కోసం.. ప్రధాని మోడీ, అమిత్ షా సహా ఎవరినైనా కలుస్తా. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే అందరి లక్ష్యం. పదేళ్లు అధికారంలో ఉన్న వారు ఈ ఆలోచన చేయకపోవడం వల్లే.. తెలంగాణకు తీరని నష్టం జరిగింది. రాష్ట్ర భాజపా నేతలు కూడా ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు తేవాలి అంటూ కోరారు.