గురువారం, 27 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (20:00 IST)

ముచ్చింతల్‌లో సమతామూర్తిని దర్శించుకున్న మంత్రి అమిత్ షా

హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ముచ్చింతల్ శ్రీరామ నగరులో ఏర్పాటు చేసిన సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం దర్శించుకున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చారు. 
 
ఈ ఆశ్రమానికి వచ్చిన అమిత్ షాకు కేంద్ర చిన్నజీయర్ స్వామి తదితరులు హార్దిక స్వాగతం పలికారు. ఈ మహోత్సవాలకు అమిత్ షా సంప్రదాయ పంచెకట్టు, తిరునామంతో వచ్చారు. ఆశ్రమంలోని విశేషాలను ఆయన చిన్నజీయర్ స్వామి వివరించారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ, శ్రీరామానుజాచార్యుల వారి దివ్య సందేశం స్ఫూర్తిదాయకం అని చెప్పారు. మనుషులంతా ఒక్కటేనని రాజానుజాచార్యులు చాటిచెప్రారని, సమతామూర్తి భావితరాల వారికి స్ఫూర్తి మంత్రం అని వెల్లడించారు. ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. 
 
కాగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి, జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత ఆయన ప్రత్యేక పూజలు చేసి ఈ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన 108 దివ్యదేశాలను ఆయన దర్శనం చేసుకున్నారు. 
 
ఇదిలావుంటే, 216 అడుగుల ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ'ని దర్శించడానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఈ నెల 13వ తేదీన ముచ్చింతల్‌కు వస్తున్నట్టు సమాచారం.