1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (15:35 IST)

లాక్డౌన్ వేళ రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తాం : హైదరాబాద్ సీపీ

లాక్డౌన్ వేళ రోడ్లపైకి వాహనాలతో వస్తే సీజ్ చేస్తామని తెలంగాణ రాజధాని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ యాదవ్ హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, హైద‌రాబాద్ వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధ‌న‌లను కఠినంగా అమ‌లు చేసేందుకు పోలీసులు రోడ్ల‌పై బారీకేడ్లు ఏర్పాటు చేసి త‌నిఖీలు చేస్తున్నారని తెలిపారు. 
 
ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధ‌న‌లు ఖచ్చితంగా పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తాజాగా ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు మ‌రింత అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ రోజు దిల్‌సుఖ్‌న‌గ‌ర్ త‌నికీ కేంద్రాన్ని ప‌రిశీలించిన హైద‌రాబాద్ సీపీ అంజ‌నీ కుమార్ మీడియాతో మాట్లాడారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న‌గ‌ర ప్ర‌జ‌లంతా లాక్డౌన్ నిబంధ‌న‌లు పాటించాలని ఆయ‌న సూచించారు. త‌మ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 180 త‌నిఖీ కేంద్రాలు ఉన్నాయ‌ని చెప్పారు. 
 
లాక్డౌన్‌ మిన‌హాయింపులు ఉన్న‌వారికే రోడ్ల‌పై తిర‌గ‌డానికి అనుమ‌తి ఉంటుంద‌ని, త‌ప్పుడు ప‌త్రాల‌తో రోడ్ల‌పై తిరిగితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి వ‌చ్చే వాహ‌నాల‌ను సీజ్ చేస్తామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లంతా లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఇళ్ల‌ల్లో ఉండాల‌ని ఆయ‌న సూచించారు. 
 
కాగా, తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న విషయం తెల్సిందే. దీంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలతో కూడిన లాక్డౌన్‌ను అమలు చేస్తోంది. ఇందులోభాగంగా, హైదరాబాద్‌ను లాక్డౌన్ అమలు చేస్తున్నారు.