1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (10:17 IST)

పూజకు ఎంపికైతే రూ.కోట్లు.. న్యూడ్ ఫోటో పంపాలన్నదే కండిషన్

తెలంగాణ రాష్ట్రంలో ఓ ముఠా అమాయక మహిళను లక్ష్యంగా చేసుకుని ఓ వికృత క్రీడ మొదలుపెట్టింది. పూజకు ఎంపికైతే కోట్లాది రూపాయలు వస్తాయని నమ్మించింది. ఇందుకోసం శరీరాకృతిని చూపిస్తూ నగ్నంగా ఉండే ఫోటోలు కావాలన్న షరతు పెట్టింది. డబ్బుకు ఆశపడిన కొందరు అమాయిక మహిళలు ఈ కేటుగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఇలా తీసుకున్న నగ్న ఫోటోలతో వారు వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. అయితే, ఓ బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పాలమూరు జిల్లా వనపర్తికి చెందిన జైనుల్లావుద్దీన్ అనే వ్యక్తి జడ్చర్లలో అద్దె ఇంటిలో ఉంటున్నారు. ఆయనతో పాటు రాములు, శంకర్ అలీ, రాములు నాయక్‌లు కలిసి మహిళల శరీరాకృతికి సంబంధించిన న్యూడ్ ఫోటోలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. నిరుపేద మహిళలను ఎంచుకుని తమకు తెలిసిన గురువు ఉన్నారని, ఆయన చేసే పూజకు ఎంపికైతే రూ.కోట్లు ఇస్తారంటూ నమ్మబలికారు. అయితే, పూజకు ఎంపిక కావాలంటే నగ్న ఫోటోలు కావాలంటూ రహస్యంగా ప్రచారం చేశారు. 
 
ఈ ఫోటోలను తిరుపతి అనే వ్యక్తిని పంపాలని నమ్మించారు. అలా గత 2 నెలలుగా 25 మంది మహిళల నగ్న ఫోటోలను సేకరించి తిరుపతి పంపినట్టు దర్యాప్తులో తేలింది. అయితే, పంపిన ఫోటోలు తిరుపతి  ఏం చేస్తాడు? తిరుపతి చెప్పిన గురువు ఎవరు? ఈ ఫోటోలతో ఏం చేస్తారన్నది తేలాల్సివుంది. ప్రస్తుతానికి ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. తిరుపతి అనే ప్రధాన నిందితుడిని పట్టుకుంటే అసలు, విషయాన్నీ బయటకు వస్తాయని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని, జడ్చర్లని సీఐ వెల్లడించారు.